ఉద్యోగ సంఘాలకు మళ్లీ నిరాశ.. తేలని పీఆర్సీ సస్పెన్స్

by srinivas |
ap cm jagan
X

ఉద్యోగుల ఫిట్‌మెంట్ వ్యవహారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం సమావేశమైన జాయింట్ స్టాఫ్​ మీటింగ్​ ఈ అంశాన్ని తేల్చలేదు. తమకు 48% పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం 14.29 శాతానికే కట్టుబడి ఉన్నట్టు సంకేతాలిస్తున్నది. ఉద్యోగుల డిమాండ్​కు ప్రభుత్వ ప్రతిపాదనకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. క్రిస్మస్ తర్వాత సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయి చర్చలు జరుపుతామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీపై క్లారిటీ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే!

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై చ‌ర్చించేందుకు సీఎస్ సహా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా పీఆర్సీ పై నెలకొన్న ప్రతిష్టంభన రీత్యా ఈ సమావేశం కీలకంగా మారింది. అయితే ముందు జాగ్రత్తగా కేవలం ఆర్థికేతర డిమాండ్స్ పైనే చర్చకు రావాలని అధికారులు పిలుపు ఇవ్వగా పీఆర్సీపై కూడా చర్చించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సహా కీలక అధికారులు అందరూ సమావేశానికి హాజరయ్యారు. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా పీఆర్సీ పై చర్చించవద్దు అన్నందుకు నిరసనగా ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. స‌మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​శర్మతోపాటు పలువురు ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆ ఒక్కటి తప్ప: ప్రభుత్వం

ప్రభుత్వం మాత్రం పీఆర్సీ పెంపు పై ఒక నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న 48%పీఆర్సీ ఇచ్చేది లేదంటున్నది. సీఎస్ కమిటీ ప్రతిపాదించిన 14.29 శాతం పీఆర్సీ కి ఉద్యోగులను ఒప్పించాలని చూస్తుంది. దానివల్ల చాలా నష్టపోతామన్న ఉద్యోగుల భయానికి మాత్రం డీఏను ముందుగా ఎంచుకున్నది. ఉద్యోగులు ససేమిరా అనడంతో ఈ భేటీ కూడా పీఆర్సీ పై స్పష్టత ఇవ్వలేకపోయింది.

క్రిస్మస్ తర్వాత సీఎంతో భేటీ

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా స్పష్టత రాకపోవడంతో ఇక పీఆర్సీ పై నిర్ణయం సీఎం చేతుల్లోకి వెళ్ళిపోయింది.27శాతం ఐఆర్ ఇప్పటికే అందుకుంటున్న తమకు అంతకంటే తక్కువగా పీఆర్సీ ఇస్తే ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. ఈ సమావేశంలో సీఎస్ తో మొత్తం 71 డిమాండ్‌లపై చర్చ జరిపామనీ, వాటిపై క్లారిటీ ఇవ్వాలనీ సీఎస్‌ను కోరామని వారు తెలిపారు. క్రిస్మస్ తరువాత సీఎంతో భేటీ అయి పీఆర్సీ పై చర్చిస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Next Story

Most Viewed