కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్‌గా సంకేత్ రే

by  |
కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్‌గా సంకేత్ రే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పానీయాల దిగ్గజం కోకాకోలా (coca-cola), కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ కార్యకలాపాల్లో సరికొత్త మార్పులు చేసింది. ఇందులో భాగంగా సౌత్ఈస్ట్ ఆసియా, కోకాకోలా ఇండియాకు నూతన ప్రెసిడెంట్‌గా సంకేత్ రేను నియమించింది. ప్రస్తుతం ఇండియా, సౌత్ఈస్ట్ ఆసియా బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్‌గా ఉన్న టి.కృష్ణకుమార్ నుంచి సంకేత్ రే భాధ్యతలను స్వీకరించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

2021, జనవరి 1 నుంచి సంకేత్ రే నియామకం అమల్లోకి రానుంది. అనంతరం కృష్ణకుమార్ కోకాకోలా ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. భారత్‌లో కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్వహించడం, కంపెనీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త ఆపరేటింగ్ యూనిట్ బృందానికి కృష్ణకుమార్ సహకరించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

కొవిడ్-19 కారణంగా కంపెనీ వ్యాపారం తీవ్రంగా దెబ్బతినడంతో వారం రోజుల క్రితం కంపెనీ ఆపరేటింగ్ యూనిట్లను సగానికి తగ్గించి సుమారు 4 వేల మంది కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పునర్నిర్మాణంలో భాగంగా కంపెనీ కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్టు, అవి కంపెనీ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయని కోకాకోలా ఛైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ తెలిపారు.

కరోనా వ్యాప్తి వల్ల రెస్టారెంట్లు (restaurants), థియేటర్ల (theatres) వంటివి మూసేయడంతో జులైలో కంపెనీ ఉత్పత్తుల్లో 28 శాతం అమ్మకాలు క్షీణించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వ్యాపార కేంద్రమని, ఆకర్షణీయమైన మార్కెట్‌గా అవతరించిందని, ఇది పెట్టుబడులను పెంచేందుకు, వ్యాపార విస్తరణకు దోహదపడుతుందని జేమ్స్ అన్నారు.


Next Story

Most Viewed