10 మంది భారత జవాన్లను విడుదల చేసిన చైనా

by  |
10 మంది భారత జవాన్లను విడుదల చేసిన చైనా
X

న్యూఢిల్లీ: ఈ నెల 15న గాల్వన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించగా, మరో పది మందిని చైనా ఆర్మీ నిర్బంధంలోకి తీసుకుంది. మూడు సార్లు ఆర్మీ మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగిన తర్వాత గురువారం సాయంత్రం పది మంది భారత సైనికులను చైనా విడుదల చేసింది. ఇందులో ఆరుగురు సోల్జర్స్ సహా ఇద్దరు మేజర్‌లు, ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారు. వీరిని గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెట్రలో పాయింట్ 14 దగ్గర భారత దళాలకు అప్పజెప్పింది. అయితే, ఈ విడుదలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నది. ఇరుదేశాల సైన్యం మధ్య తొలి రెండు రౌండ్‌ల చర్చలు ఫలితాలివ్వకున్నా మూడో దఫా చర్చలు సుదీర్ఘంగా కనీసం ఆరుగంటలపాటు సాగి కొద్దిమేరకు ఫలించాయి. ఈ చర్చల్లో మనదేశ ప్రతినిధులకు నిర్బంధించిన సైనికుల చిత్రాలను చైనా చూపించినట్టు సమాచారం. వారంతా సురక్షితంగా ఉంటారని హామీనిచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆర్మీ మాత్రం ఈ హింసాత్మక ఘర్షణల్లో ఎవ్వరూ మిస్ కాలేదని గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘర్షణల్లో ప్రమేయమున్న ప్రతి జవాను లెక్కకొచ్చారని చెప్పుకొచ్చింది. మూడో దఫా చర్చల తర్వాత తాజాగా, నిర్బంధించిన భారత జవాన్లను చైనా విడుదల చేయడంతో సరిహద్దు గొడవ సద్దుమణుగనుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.


Next Story

Most Viewed