ఎఫ్‌వై23లో 77% తగ్గిన షియామీ ఇండియా లాభం

by Harish |
ఎఫ్‌వై23లో 77% తగ్గిన షియామీ ఇండియా లాభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షియామీ ఇండియా తాజాగా 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఇండియాలో కంపెనీ లాభం ఏడాది ప్రాతిపదికన 77 శాతం తగ్గి రూ. 238.63 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం ఇండియాలో రూ.1,057.7 కోట్లుగా ఉండగా, ఈ సారి భారీగా తగ్గడం గమనార్హం. అలాగే, ఎఫ్‌వై22 లో షియామీ(Xiaomi) కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ. 39,100 కోట్ల నుండి ఎఫ్‌వై23లో 32 శాతం క్షీణించి రూ.26,697 కోట్లకు తగ్గింది.

సమీక్ష కాలంలో షియామీ ఉత్పత్తుల విక్రయం ద్వారా రూ.26,395 కోట్లు, ప్రకటనలు, విలువ ఆధారిత సేవలతో సహా సేవల విక్రయం ద్వారా రూ. 264 కోట్లు ఆర్జించింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 21 శాతం మార్కెట్ వాటాను షియామీ కలిగి ఉంది. మార్చి 2024 త్రైమాసికంలో సైబర్‌మీడియా రీసెర్చ్ ప్రకారం, దేశీయ మార్కెట్లో శాంసంగ్ కంటే షియామీ వెనుకబడి ఉంటుందని అంచనా వేసింది. షియామీ ఇటీవలే భారతదేశంలో 10 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది. తర్వాత దశాబ్దంలో కంపెనీ తన పరికరాల అమ్మకాలను 70 కోట్లకు రెట్టింపు చేయాలని యోచిస్తోంది.



Next Story