Microsoft: మైక్రోసాఫ్ట్‌ యూజర్స్‌కు అమెరికా సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక.. హ్యాకింగ్‌కు చాన్స్

by Harish |
Microsoft: మైక్రోసాఫ్ట్‌ యూజర్స్‌కు అమెరికా సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక.. హ్యాకింగ్‌కు చాన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్‌ స్ట్రైక్ కంపెనీ ఇచ్చిన అప్‌డేట్‌లో లోపం కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. అయితే దీనిలో వచ్చిన బగ్‌ను ఆసరాగా చేసుకుని కొంత మంది హ్యాకర్లు సిస్టంలను హ్యాకింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CISA హెచ్చరించింది. టెక్నికల్ సమస్య పరిష్కారానికి లింక్‌లపై క్లిక్ చేయాలని ఈమెయిల్ ద్వారా వినియోగదారులకు వివిధ లింక్‌లను పంపిస్తున్నట్లు ఏజెన్సీ గుర్తించింది. ఈ లింక్‌లపై క్లిక్ చేయగానే వ్యక్తిగత, ఇతర ముఖ్యమైన, సున్నితమైన డేటా మొత్తం కూడా హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా అనుమానస్పద లింక్‌లు, ఈమెయిల్‌లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది.

మరోవైపు మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ఈ సమస్యపై స్పందించారు. మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగిన విషయం మా దృష్టికి వచ్చింది. కస్టమర్‌లకు వారి సిస్టమ్‌లను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి సాంకేతిక సమస్యలను పరిష్కరించాము. క్రౌడ్‌స్ట్రైక్‌ ఇచ్చిన అప్‌డేట్‌లో లోపం కారణంగా ఈ అంతరాయం తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం బగ్‌ను గుర్తించి సమస్యను పరిష్కరించామని క్రౌడ్‌స్ట్రైక్‌ పేర్కొంది.



Next Story