Union Budget 2024: ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం దృష్టి సారించే ఐదు ముఖ్యమైన అంశాలు

by S Gopi |
Union Budget 2024: ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం దృష్టి సారించే ఐదు ముఖ్యమైన అంశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో నాలుగైదు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎప్పటిలాగే అన్ని వర్గాల నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం 'వికసిత్ భారత్ ' విజన్ కోసం బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ కీలక అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాబోయే బడ్జెట్ 2047 నాటికి 'వికసిత్ భారత్'కు రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ కోసం ప్రభుత్వం ఐదు ప్రాధాన్యతలను ఆయన వివరించారు. వాటిలో స్థూల ఆర్థిక నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని జయంత్ సిన్హా చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పదునైన స్థూల ఆర్థిక నిర్వహణను కలిగి ఉంది. ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధిని ప్రోత్సహించడం ఈ సారి బడ్జెట్‌లో ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే, సామాజిక సంక్షేమ పథకాలు రెండో ప్రాధాన్యతగా ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఇళ్ల నిర్మాణాలతో సహా విస్తృతమైన సామాజిక సంక్షేమ పథకాలపై దృష్టి ఉంటుంది.

ఇక, రెండోటర్మ్‌లో ప్రధాని మోడీ మౌలిక సదుపాయాలపై ఎక్కువ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈసారి బడ్జెట్‌లోనూ మూడో ప్రాధాన్యతగా రోడ్లు, హైవేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు మూలధన వ్యయం పెంచనున్నామని జయంత్ సిన్హా చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ. 11 లక్షల కోట్లకు పెరిగింది. దీన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ ఖర్చు రాబోయే 10 నుంచి 20 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా నడిపిస్తుందని భావిస్తున్నామని సిన్హా తెలిపారు.

మరో ప్రాధాన్యతగా వ్యాపార సంస్కరణలు చేపడతామని వ్యాపార వాతావరణాన్ని క్రమబద్దీకరించి, వ్యాపారాన్ని సులభతరం చేసే సంస్కరణలు ఉంటాయి. జీఎస్టీ రేట్లను సరళీకృతం చేయడం, కార్మిక చట్టాలను మెరుగుపర్చి పోటీతత్వాన్ని పెంపొందించడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ముఖ్యమైన సంస్కరణ చర్యలు ఉంటాయని సిన్హా వెల్లడించారు. ఈ సంస్కరణలు స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కల్పిస్తాయి. చివరి ప్రాధాన్యతగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మధ్యంతర బడ్జెట్‌లోనే ఇది ఎక్కువ చర్చకు వచ్చింది. ఆర్అండ్‌డీని విస్తరించేందుకు రూ. లక్ష కోట్ల నిధులతో జాతీయ ఇన్నోవేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆర్థిక మంత్రి వ్యక్తం చేశారు. దీని ద్వారా మన విశ్వవిద్యాలయాలు, ఐఐటీలను బలోపేతం చేయడానికి వీలుంటుందని సిన్హా చెప్పారు.



Next Story