Hacking: ముఖ్యమైన కేసుల విచారణ రోజే హ్యాకింగ్

by Harish |
Hacking: ముఖ్యమైన కేసుల విచారణ రోజే హ్యాకింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తాజాగా సైబర్ కేటుగాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టు యూట్యూబ్ చానల్‌ను హ్యాక్ చేశారు. శుక్రవారం ఉదయం కోర్టుకు సంబంధించిన వివరాలు కాకుండా Ripple Labs అనే US-ఆధారిత కంపెనీ అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీ XRPని ప్రమోట్ చేసే వీడియోలు చానల్‌లో ప్రసారం అయ్యాయి. వెంటనే దీనిని గుర్తించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చానల్ లింక్‌ని నిలిపివేసింది. ఐటీ విభాగాన్ని సంప్రదించగా చానల్‌ని రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా బెంచ్ విచారించే కేసులను ప్రజా ప్రయోజనాల కింద ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఆర్‌జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసును చానల్ ప్రసారం చేస్తున్న సమయంలో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్రానికి నిర్ణీత కాలపరిమితిని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) సహా అనేక ముఖ్యమైన కేసులను సుప్రీంకోర్టు విచారించనున్న రోజే హ్యాకింగ్ ఘటన జరిగింది. చానల్ హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టు పరిపాలన విచారణ ప్రారంభించిందని బార్ అండ్ బెంచ్ వర్గాలు తెలిపాయి. 2018లో అన్ని రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి నిరంతరాయంగా నడిచిన యూట్యూబ్ చానల్ హ్యాక్ కావడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed