AIపై ప్రైవేట్ పెట్టుబడిలో 10వ స్థానంలో భారత్

by Harish |
AIపై ప్రైవేట్ పెట్టుబడిలో 10వ స్థానంలో భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఏఐ వాడకానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం కూడా దేశంలో కృత్రిమ మేధస్సుపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన బాండ్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏఐలో రూ.11 వేల కోట్లకు పైగా($1.4 బిలియన్ల) ప్రైవేట్ పెట్టుబడితో భారతదేశం పదో స్థానంలో ఉంది. భారత్ ఢిల్లీలో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఈ డేటా వచ్చింది.

ఈ జాబితాలో రూ. 5.5 లక్షల కోట్ల(67 బిలియన్ డాలర్ల)కు పైగా పెట్టుబడులతో అమెరికా అగ్రస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఆ తరువాత $8 బిలియన్ల పెట్టుబడులతో చైనా రెండవ స్థానం, తర్వాత యూకే, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, కెనడా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా గరిష్టంగా ఏఐలో ప్రైవేట్ పెట్టుబడులను అందుకున్న జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐపై ఎక్కువ పెట్టుబడి పెడుతున్న దిగ్గజ 17 కంపెనీలు మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఆపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్ వంటివి ఎక్కువగా అమెరికాకు చెందినవిగా ఉన్నాయి. ఈ 17 కంపెనీలలో తొమ్మిది కంపెనీలు టెక్, AI రంగంలో ఉన్నాయి.

నివేదిక ప్రకారం, 2000వ దశకం ప్రారంభంలో స్థాపించబడిన వాటి కంటే కొత్త తరం కంపెనీలు 100 మిలియన్ల వినియోగదారులను చాలా వేగంగా చేరుకుంటున్నాయని నివేదిక హైలైట్ చేస్తుంది. ఉదాహరణకు, Netflix, LinkedIn వంటి కంపెనీలు ఈ మైలురాయిని సాధించడానికి దాదాపు ఒక దశాబ్దం పట్టగా, కానీ ChatGPT వంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఆరు నెలల కంటే తక్కువ సమయంలోనే దీనిని సాధించాయి. ఏఐ పెట్టుబడుల పరంగా అమెరికా ఆధిపత్యం చెలయిస్తున్నప్పటికి, దీనికి పోటీగా చైనా, భారత్ కూడా ఎక్కువ పెట్టుబడులను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

Next Story