Farming: వ్యవసాయంపై రైతులకు తగ్గుతున్న ఆసక్తి.. అసలు కారణమిదే!

by Gantepaka Srikanth |
Farming: వ్యవసాయంపై రైతులకు తగ్గుతున్న ఆసక్తి.. అసలు కారణమిదే!
X

ఒకనాడు పల్లెలు అన్ని రకాల ధాన్యాలతో కళకళలాడేవి. ఆడంబరాలకు డబ్బు లేకపోయినా తినడానికి ఏ లోటు లేకుండా ఉండేది. కానీ, రోజులు మారాయి. రైతు కూడా పప్పులు సహా బియ్యం కూడా కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సాగుతోపాటు అంతరపంటలుగా కూరగాయల సాగు పల్లెల్లో జోరుగా సాగేది. ఏ ఇంటి ఆవరణలో చూసినా చిక్కుడు కాయ, సోరకాయ, బీరకాయ పాదులు సహజంగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ ఆసక్తి రైతుల్లో తగ్గిపోవడంతో నిత్యావసర సరుకులు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లో పచ్చి మిర్చి సహా ఏ కూరగాయ ధర అయినా దాదాపుగా కిలో రూ.వందకు దగ్గరలో ఉన్నది. రూ.50 కిలో ఏ కూరగాయ దొరకడంలేదు. రూ.100కు 3 కిలోల టమాటాలు అంటూ నగరాల్లో ఆటోల్లో తెచ్చి అమ్ముతున్నా అందులో చాలామటుకు పాడైనవే ఉంటున్నాయి. ఇలా అటు.. పండించిన పంటలు కాకుండా.. మార్కెట్లో దొరుకుతున్న వాటిని తింటుండడంతో అదే స్థాయిలో రోగాలూ వెంటాడుతున్నాయి. ఫలితంగా వైద్యానికి బోలెడు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులపై కేంద్రం తాజాగా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అధిక ధరలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం నుంచి 200 శాతం వరకు పెరిగినట్లు ‘వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ)’, వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదిక వెల్లడించింది. అయితే.. గతేడాది విడుదల చేసిన నివేదికలోనూ తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. - శ్రీనివాస్ బొల్లబత్తిని

సారవంత భూములున్నా..

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సారవంతమైన భూములు ఎక్కువ. ఇక్కడ పంటలు అధికంగా పండించే చాన్స్ ఎక్కువగానే ఉన్నది. కానీ.. సరైన సాగు పద్ధతులు లేకపోవడంతోపాటు పెట్టుబడి కూడా ఎక్కువ కావడంతో ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గతంలో పల్లె జనాభాలో 70శాతానికిపైగా రైతు కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లోనూ దాదాపుగా అందరూ వ్యవసాయంలో భాగస్వాములు అయ్యేవారు. దీంతో రైతు కూలీలు, యంత్రాలతో అవసరాలు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పల్లెల్లో రైతులు 50శాతం కూడా లేరు. ఆ కుటుంబాల్లో ఒకరిద్దరు మినహా మిగితావారు వ్యవసాయ పనులకు దూరంగానే ఉంటున్నారు. నిజానికి పల్లెల్లో వ్యవసాయం ఇప్పుడు ప్రధాన వృత్తి కాదు. రియల్ ఎస్టేట్, రిటైల్ షాపులు సహా బట్టల దుకాణాలు, చికెన్ షాపులు ఇలా ఎన్నో ఉప వృత్తుల వైపు రైతు కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయం, అంతరపంటలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. గతంలో ప్రతి ఇంటికీ కూరగాయల పాదులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెల పెంపకం ఉండేది. కానీ, ఇప్పుడు వాటి పెంపకం రైతు కుటుంబాల జీవనశైలికి ఆటంకంగా మారింది. ఏదైనా పెళ్లి పేరంటానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే కోళ్లు, మేకలు, గేదెల కోసం ఎవరో ఒకరు తప్పక ఉండాల్సి వస్తుంది. అందుకు చాలామంది సిద్ధంగా లేకపోవడంతో వాటి పెంపకమే తగ్గిపోయింది. పల్లెల్లోకి కూడా ప్యాకెట్ పాలు వస్తుండటంతో ఆవులు, బర్రెలను పెంచాల్సిన అవసరం ఏమున్నది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో అంతరపంటలు సహా ప్రధాన పంటలకు విత్తనాలు సొంతంగా అభివృద్ధి చేసుకునేవారు. ఇప్పుడు కంపెనీలే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుండటం.. అంతరపంటల విత్తనాలు నాసిరకంగా ఉంటుండటంతో చాలామంది రైతులు శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా గ్రామాల్లో ఆదాయం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు బోడకాకరకాయ పల్లెల్లో పెంటలపై మొలిచేది. వాటిని చాలామంది తినేవారు కూడా కాదు. కానీ, ఇప్పుడు పట్టణాల్లో దాని ధర కిలో 200పైమాటే. ఇలా అనేక కూరగాయల ధరలు పెరిగిపోవడానికి కారణం రైతులు ఆయా పంటల ఉత్పత్తిపై ఆసక్తి చూపకపోవడమే. ప్రభుత్వాలు, ప్రధానంగా వ్యవసాయాధికారులు తగిన సలహాలు ఇస్తే పల్లెలు సిరిసంపదలతో తలతూగుతాయి.

పెరుగుతున్న హాఫ్ ఫార్మర్స్

మరోవైపు.. రాష్ట్రంలో హాఫ్ ఫార్మర్స్ సంస్కృతి చాలావరకు పెరుగుతున్నది. అంటే.. పిల్లల చదువు నిమిత్తం లేదా ఉపాధి నిమిత్తం పెద్దపెద్ద నగరాలకు వలస వచ్చిన రైతులు.. తమ పల్లెల్లోని వ్యవసాయాన్ని కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. అయితే.. వారంలో ఐదు రోజులు సిటీల్లో ఉంటూ.. రెండు రోజులు పల్లెలకు వెళ్లి వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఉన్న భూమిని అమ్ముకోలేక.. కౌలుకు ఇచ్చేస్తున్నారు. సొంత భూమిని చూసుకునేందుకు మాత్రం ఎప్పుడో వీలు చిక్కినప్పుడల్లా గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. పట్టణాల్లో ఉండటం గొప్పగా భావించడం.. పల్లెల్లోని మౌలిక వసతుల లేమి కూడా ఇందుకు దోహదపడుతున్నది. చాలామంది రైతులు పిల్లల చదువు పేరుతో వ్యవసాయం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. పట్టణాల్లో వాచ్‌మన్ ఉద్యోగాలు, లేబర్ పనులు కూడా చేయడానికి వెనుకాడటం లేదు.

పూర్వం రైతులు వరి, పెసర, కంది సజ్జలు, నువ్వులు, ఉలవలు, రాగులు, మినుములు పజ్జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, మక్కజొన్న, బుడ్డ శనగలు, అలసంద, గోధుమ తదితర పంటలు సాగు చేసేవారు. ఈ సంప్రదాయ వ్యవసాయం వల్ల పల్లెల్లో గ్రామీణ స్వయం పోషక విధానం ఉండేది. కానీ.. ఇప్పుడు చిరుధాన్యాలు, ఆరుతడి పంటల సాగు తగ్గిపోయింది. దీంతో మనం చిరుధాన్యాలు, పప్పు దినుసులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతుండగా.. సామాన్యుడు బతకలేని పరిస్థితికి వచ్చింది.

సాగులో కొత్తతరం సాధ్యమేనా?

వ్యవసాయం చేయడం దండుగ అని ఇప్పటికే చాలామంది రైతులు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలను మాత్రం ఈ రొంపిలోకి దింపొద్దని బలంగా అనుకుంటున్నారు. చాలామందిలో ఈ అభిప్రాయం ఉండటంతో అసలు వచ్చే కొన్నేళ్లలో వ్యవసాయంలోకి కొత్త తరం వస్తుందా? అనే భయాలు నెలకొన్నాయి. గతంలో ప్రతి రైతు తమకు ఉన్న నైపుణ్యాలతో సాగు మెళకువలు పెంచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తూ దిగుబడి పెంచుకునేవారు. రకరకాల ఉపయోగకరమైన చిరుధాన్యాలు సహా పప్పు దినుసులు సాగు చేసేవారు. కానీ, ఇప్పుడు పల్లెల్లో ప్రధానంగా వరి.. తర్వాత మొక్కజొన్న, పత్తి తప్ప మిగతా పంటలపై దృష్టి పెట్టడంలేదు. వరికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుండటంతో పంటకు మినిమం గ్యారంటీ అన్న కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు. కానీ, చిరుధాన్యాలు, పప్పుదినుసులు పండిస్తే అంతకుమించి లాభం వస్తుందని రైతులకు తెలిసినా.. ధైర్యం చేయలేకపోతున్నారు. అకాల వర్షాలకు ఇతర పంటలు నష్టపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదని.. దిగుబడి అనుకున్నంత రాకపోతే ఎలా అన్న భయాలు వారిని కొత్త పంటల దిశగా ఆలోచించనీయడంలేదు. ప్రభుత్వాలు, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు చొరవ తీసుకుని రైతులకు తగిన సలహాలు ఇస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

కార్పొరేట్ సాగు తప్పదా?

చాలా రైతు కుటుంబాలు వ్యవసాయం నుంచి తప్పుకుంటుండటంతో రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి అడుగుపెడతాయి. రైతులనుంచి భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తాయి. పూర్తి యాంత్రీకరణతో ఆహార ఉత్పత్తులపై పూర్తి ఆజమాయిషీ సాధిస్తాయి. అప్పుడు కిలో రూ. 1000 అయినా ఆశ్చర్యం ఉండదు. పైగా కార్పొరేట్ కంపెనీలు అగ్రదేశాలకు ఎగుమతి చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాయి.. కాబట్టి మన దేశంలో పండే పంటలు మనం తినే అవకాశం కూడా మనకి దక్కుతుందో? లేదో?. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంపై ఆజమాయిషీ సాధిస్తే దేశంలో ఆహార లభ్యత సహా ఆహారపుటలవాట్లు కూడా వారే నిర్దేశించే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి.. రైతులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

అన్ని ధరలు ఎక్కువే..

మణిపుర్, త్రిపుర రాష్ట్రాలు దేశానికి ఈశాన్య ప్రాంతంలో మారుమూలన ఉన్నాయి. అక్కడి నుంచి సరుకులు తీసుకురావాలన్నా.. పంపాలన్నా బోలెడు రవాణా చార్జీలు అవసరం. దాంతో అధిక ధరలు సాధారణ విషయం. కానీ, సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ 201.6 సీపీఐ (కన్స్యూమర్ ప్రైస్‌ ఇండెక్స్‌)తో ప్రధాన రాష్ట్రాలను దాటి అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదలకు అద్దం పడుతున్నది. మరోవైపు.. ఇక్కడ కూరగాయలు, పప్పుల ధరలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువేనని నివేదిక వెల్లడించింది. మొత్తం 22 ప్రధాన రాష్ట్రాల వివరాలను కేంద్రం వెల్లడించింది. వీటిలో 201.6తో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేసులో ఉండగా.. జమ్ము 200.1, కేరళ 198 పాయింట్లతో తదుపరి వరుసలో నిలిచాయి. అయితే.. ఆగస్టు 2023లో 197.6 పాయింట్లతో 22 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండగా.. ఈ సారి కూడా అదే స్థానాన్ని కొనసాగించింది. దాంతో తెలంగాణలో ప్రజల బతుకు భారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదాయం పెరిగినా.. ఖర్చులూ పెరిగాయి..

దేశంలో సగటున వ్యక్తి ఆదాయం 12 ఏళ్లలో రెట్టింపైనా.. జీవన ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సామాన్యుల రోజువారీ జీవనానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి వైద్యం వరకూ ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదిక పలు అంశాలను స్పష్టం చేసింది. గతంలోనే చాలా మంది కేంద్రం పెద్దలు రాష్ట్రాన్ని అలర్ట్ చేశారు. గతేడాది సీడబ్ల్యూసీ మెంబర్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం మన రాష్ట్రం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ధరలు, నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉందన్నారు.

నివేదిక ఇలా రూపొందించారు..

‘వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ)’, వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్ఎస్ఓ (National Sample Survey Organization) సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది తయారు చేశారు. వీరు దేశవ్యాప్తంగా 1,114 పట్టణాల్లోని మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో సిద్ధం చేశారు. దాని ప్రకారం ఈ ఆగస్టు నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా కీలకమైన నిత్యావసర సరుకుల ధరల్లో వ్యత్యాసం, సరుకుల వారీగా, రాష్ట్రాల వారీగా పేర్కొంది.

గ్రామాల నుంచి పెరుగుతున్న వలసలు

కేంద్ర వైద్యారోగ్య శాఖ ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23’ని సైతం ఇటీవల వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 23 మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా 7.84 శాతం తగ్గింది. పట్టణ జనాభా 34.05 శాతం పెరిగిందని వెల్లడించింది. జూలై 1, 2023 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జనసాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ 14,491తో టాప్‌లో ఉండగా.. తెలంగాణ 386తో 18వ స్థానంలో ఉందని వివరించింది. అదే పట్టణాలకు వచ్చేసరికి 4,885, గ్రామాలలో 210 ఉందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed