రూ. 5.74 లక్షల కోట్లకు దేశీయ ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by Harish |
రూ. 5.74 లక్షల కోట్లకు దేశీయ ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో జులై 11 నాటికి 19.54 శాతం పెరిగి రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.4.80 లక్షల కోట్లుగా నమోదైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, మొత్తం వసూళ్లలో కార్పొరేషన్ పన్ను రూ. 2.1 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను రూ. 16,634 కోట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా 2024-25లో జులై 11 వరకు పన్ను చెల్లింపుదారులకు రూ.70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్‌లను జారీ చేయగా, ఇది 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే 64.49 శాతం ఎక్కువ.

మొత్తంగా స్థూల ప్రాతిపదికన, రీఫండ్‌లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జులై 11 వరకు రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది. ఈ క్రమంలో మొదటి త్రైమాసికంలో జులై నాటికి వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు వివిధ పన్ను వర్గాల్లో సానుకూల వృద్ధి పథాన్ని చూపించాయి.

Advertisement

Next Story