Finance Ministry: బంగారం వేలంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. నిర్మలా సీతారామన్

by S Gopi |
Finance Ministry: బంగారం వేలంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం వేలం నిర్వహించే ప్రక్రియలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నిబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి.. బంగారు రుణాలు తీసుకున్న కస్టమర్లు చెల్లింపుల్లో విఫలమైతే, సదరు బంగారం వేలం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాయన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌సీబీ) రెండింటికీ ఒకే విధమైన నిబంధనలు ఉన్నాయి. బంగారు రుణం తీసుకున్న ఖాతాదారు చెల్లింపులు చేయలేని పక్షంలో తగినన్నిసార్లు నోటీసులు ఇవ్వాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. అప్పటికీ చెల్లింపులు చేయలేనప్పుడే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వేలానికి వెళ్లాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. వేలం ప్రక్రియకు ముందు అనుసరించాల్సిన విధానాలు, కఠిన ప్రక్రియ ఉంటుందన్నారు. వీటికి సంబంధించి బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి వివరించారు.

Next Story