వైఎస్ఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. జిల్లా పేరు మార్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
వైఎస్ఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. జిల్లా పేరు మార్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేశా చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంద్భంగా షర్మిల.. అనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందని విమర్శించారు.

ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసెయ్యడాన్ని ఖండించారు. అలాగే వైఎస్ఆర్ అంటే ఎందుకింత కక్ష అని నిలదీశారు. వైఎస్ఆర్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అనో లేక పాత కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని, దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆధ్యుడని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత అని కీర్తించారు.

ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్ఆర్ అని తెలిపారు. తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదని ఫైర్ అయ్యారు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదని, వైఎస్ఆర్ అనే పేరు ప్రజల ఆస్తి అని చెప్పారు. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని, వైఎస్ఆర్ తెలుగు వారి సొత్తు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించారు.

Next Story