ప్రధాని నరేంద్ర మోడీ కటాక్షం.. జగ‌న్‌కా, చంద్రబాబుకా!

by Shiva |
ప్రధాని నరేంద్ర మోడీ కటాక్షం.. జగ‌న్‌కా, చంద్రబాబుకా!
X

రైతు రుణ మాఫీని మేనిఫెస్టోలో ప్రకటించాలని వైసీపీ యోచిస్తోంది. ఇందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో సీఎం జగన్​ ఢిల్లీ పెద్దలను కలుస్తారని తెలుస్తోంది. దీంతో మోడీ కరుణా కటాక్షాలు జగన్​ కే ఉంటాయా లేక చంద్రబాబు కూటమికా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు పలువురు రాష్ట్ర నేతలు వైసీపీ సర్కారుపై ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఆధారాలతో సహా సమర్పించినా ఢిల్లీ బాద్​ షాలు స్పందించలేదు. ఇంతకీ మోడీ-షాల కటాక్షం జగన్​కా.. చంద్రబాబుకా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. కేంద్ర పెద్దలు మాత్రం గుంభనంగా ఉన్నారు. పొత్తు గురించి తేల్చకుండానే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇదే సమయంలో వైసీపీ మేనిఫెస్టోపై దృష్టిసారించింది. డ్వాక్రా మహిళలతో పాటు రైతులకు రుణ మాఫీని ప్రకటించాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం సహకారం లేకుండా హామీలు ఇవ్వకూడదని జగన్​ భావిస్తున్నారు. దీనిపై కేంద్రంతో చర్చించేందుకు మార్చి మొదటి వారంలో సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే రుణమాఫీని మేనిఫెస్టోలో చేరుస్తారు. ఓవైపు టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్​ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతారా అనేది చర్చనీయాంశమైంది.

బీజేపీ వైఖరి ఇదేనా..

వైసీపీ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్నో అవినీతి ఆరోపణలు సంధించారు. మద్యం అమ్మకాల నుంచి ఇసుక తవ్వకాల వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఆధారాలతో సహా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఢిల్లీ పెద్దలు ఎంతమాత్రం స్పందించలేదు. విశాఖ సభలో అమిత్​ షా రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. అయినా ఆచరణలో జగన్​తో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ పిలిపించినప్పుడు ముందురోజు సీఎం జగన్​తో చర్చించారు. దీన్నిబట్టి వైసీపీ, టీడీపీ కూటములతో బీజేపీ సయోధ్య నెరపడానికే సిద్దమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జగన్ కోరికను తీరుస్తారా?

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ దూకుడుకు కేంద్ర పెద్దలు ముక్కుతాడు వేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లున్న కమలనాథులను కలుపుకుపోవడానికి ప్రధాన కారణం సీఎం జగన్​ అవినీతి అక్రమాల ఆరోపణలపై చర్యలు తీసుకుంటారనే. జనసేనాని పవన్​ సైతం కేంద్రం అండ చూసుకొని రాష్ట్ర సర్కారుపై విరుచుకుపడుతున్నారు. దీనికి భిన్నంగా కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. ఇంతకీ సీఎం జగన్​ అడిగే రుణ మాఫీకి కేంద్రం ఆమోదం తెలుపుతుందా ? టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపి జగన్​పై ఎదురు దాడికి దిగుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More : AP పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. తెరపైకి బీజేపీ ‘కాపు సీఎం’ నినాదం

Advertisement

Next Story