మ‌న విద్యార్థులు పోటీ ప్ర‌పంచంలో లీడ‌ర్స్‌గా ఎద‌గాలి: సీఎం జగన్

by Seetharam |   ( Updated:2023-12-20 09:39:06.0  )
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మ‌న విద్యార్థులు పోటీ ప్ర‌పంచంలో లీడ‌ర్స్‌గా ఎద‌గాలి..పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదు. అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా‘జగనన్న విదేశీ విద్య’పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ‘పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతుండటం చాలా ఆనందంగా ఉంది. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు రూ.8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

విద్యార్థులకు తోడుగా..

‘తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేదు.ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుంది అనే భరోసా ఇస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. శాచురేషన్‌ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్‌ రేటింగ్, టైమ్స్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 50 కాలేజీల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్‌ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చి తోడుగా నిలబడే కార్యక్రమం’చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని...రూ.9.50 కోట్లు వారికి ఇస్తున్నామని, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు నేడు ఇస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 107 కోట్లు 408 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

మెయిన్స్‌కు ఎంపికైతే లక్షా ఏభైవేలు

మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎన్నికైన వారిని కూడా ప్రోత్సహించేందుకు ఈ రోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రిలిమ్స్‌ పాసైన వారేవరైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలీమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే మరో రూ.50 వేలు కలిసి రూ.1.50 ఇస్తామని సీఎం ప్రకటించారు. ఎన్నిసార్లు పరీక్షలు రాసినా కూడా ఈ ప్రోత్సాహకం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఇంకా ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ చదువులను ప్రోత్సహించే కార్యక్రమం మొదలుపెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ రెండో కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది విద్యార్థులు ప్రిలిమ్స్‌కు చేరారని, వీరిలో 11 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని అన్నారు. ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాచురేషన్, పారదర్శకత అన్నది ప్రజల ముందుర ఉంచుతున్నామని, ఎవరికి రెకమెండేషన్లు అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, మీరు క్వాలిఫై అయి అప్లికేషన్‌ పెట్టుకుంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed