నాదెండ్ల మనోహర్ పర్యటన: జనసేన నేత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

by Seetharam |
నాదెండ్ల మనోహర్ పర్యటన: జనసేన నేత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అల్లపల్లివారి పాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు బండారు వెంకటరాజు ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం వెంకటరాజు కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.వెంకటరాజు మృతికి గల కారణాలు, కుటుంబ స్థితిగతులను ఆరా తీశారు. మృతుడి భార్య శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.

రెండు రోజుల పర్యటన

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెం చేరుకున్న నాదెండ్ల మనోహర్‌కు కోనసీమ ముఖద్వారం వద్ద పార్టీ నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. మనోహర్‌ని పూలమాలలతో ముంచెత్తారు. అక్కడి నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మనోహర్‌కి స్వాగతం పలికిన వారిలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్, మండపేట ఇన్‌చార్జి వేగుళ్ళ లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఇకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి రూ. 5 లక్షల బీమా చెక్కులు అంద చేయనున్నారు. ఈనెల 19న కాకినాడలో పార్టీ ముఖ్యనాయకులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed