ఈ ఎన్నికల్లో ఆ ఐదుగురిదీ హ్యాట్రిక్ రేస్

by Mahesh |
ఈ ఎన్నికల్లో ఆ ఐదుగురిదీ హ్యాట్రిక్ రేస్
X

దిశ ప్రతినిధి, కడప: ముందుగా కాంగ్రెస్‌లో ఇద్దరు, ఆ తర్వాత వారితో పాటు వైసీపీలో వరుస విజయాల పరంపర సాగిస్తూ వస్తున్న ఐదుగురితో కలిపి మొత్తం ఏడుగురు అభ్యర్థులను ఈసారి విజయం వరిస్తుందా! అనేది చర్చనీయాంశమైంది. అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత వైసీపీ వ్యవస్థాపకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నేతృత్వంలో ఈ ఏడుగురు ఆ పార్టీల జెండా ఎగర వేస్తూ వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పలువురు సీనియర్లు వరుస విజయాలు సాధించినా, 2009 నుండి జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ సారి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో దిగారు. వీరిలో 2009 నుండి పోటీ చేస్తూ వస్తున్న ఇద్దరు ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో పోటీ చేసి హ్యాట్రిక్ దాటి నాలుగు సార్లు విజయం సాధించగా మరో ఐదుగురు రెండు సార్లు విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ఎన్నికల రేసులో కసరత్తు చేస్తున్నారు. ఈసారి వారిని విజయం వరిస్తుందా! వారిలో ఎందరు హ్యాట్రిక్ కొడతారు. హ్యాట్రిక్ దాటిన ఆ ఇద్దరిలో డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా ఐదోసారి విజయం సాధిస్తారా! అన్నది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఐదో విజయం కోసం ఆ ఇద్దరు..

వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారిలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలు ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించి ఐదోసారి విజయం సాధించేందుకు ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. వీరిద్దరూ 2009లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత వైయస్ మరణానంతరం కాంగ్రెస్ లో ఏర్పడిన పరిణామాల కారణంగా వీరిద్దరితో పాటు ప్రస్తుత రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పైన కాంగ్రెస్ అనర్హత వేటు వేయడం తో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మల్లీ గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వైసీపీ అభ్యర్థులుగా గెలుపొందిన వీరు ఇద్దరు 2019 లోను ఆ రెండు నియోజకవర్గాల నుంచి విజయం వీరు విజయం సాధించారు. 2019 లో ఆకేపాటికి టికెట్ ఇవ్వక పోవడంతో ఆయన పోటీ చేయలేదు.దీంతో ఇప్పుడు వీరిద్దరూ నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా వరుస విజయాలు సాధించి ఐదోసారి విజయంతో డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరయ్యే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

హ్యాట్రిక్ రేసులో సీఎంతో పాటు ఐదుగురు..

ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ రేస్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2019లో తిరిగి పోటీ చేసి రెండోసారి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆయన మరోసారి గెలుపు పొందితే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అంజద్ భాషా, మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్రనాధ రెడ్డిలు 2014 , 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.

వీరు ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ సారి జరగబోయే ఎన్నికలు తెలుగుదేశం, దాని కూటమి , వైసీపీ ల మధ్య హోరాహోరీ పోరు కనిపించనుండడంతో వీరిలో హ్యాట్రిక్ సొంతం చేసుకునేది ఎవరు? ఇప్పటికే హ్యాట్రిక్ దాటి నాలుగు సార్లు సార్లు విజయం చేజిక్కించుకుని ఐదోసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్న వీరిని విజయం వరిస్తుందా! అన్న ఆసక్తికర చర్చ జిల్లాలో జరుగుతుంది. ఈ ఏడుగురు కూడా ఎన్నికల్లో విజయాలు సాధిస్తే జిల్లా ఎన్నికల చరిత్రలో వారికి పరువు సీనియర్‌లతో పాటు ప్రత్యేక స్థానం దక్కుతుంది. మరి ఎన్నికల ఫలితాలు వీరి లక్ష్యాలను సంకల్పాలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed