‘ప్రత్యేక’ హీరో ఎవరు? ఎన్డీఏతో టీడీపీ, జనసేన కూటమి పొత్తు కుదిరితే..!

by Ramesh N |
‘ప్రత్యేక’ హీరో ఎవరు? ఎన్డీఏతో టీడీపీ, జనసేన కూటమి పొత్తు కుదిరితే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధానంగా టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడే అవకాశం కన్పిస్తోంది. కానీ సీట్ల సర్ధుబాటు విషయం ఇంకా తేలాల్సి ఉంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు బాబుతో ఇటీవల సమావేశమైనట్లు సమాచారం.

ఎన్డీఏతో టీడీపీ, జనసేన కూటమి పొత్తు కుదిరితే..!

అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పొత్తు కన్ఫామ్ అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ బీజేపీకి ఏపీ ప్రత్యేక హోదా లాంటి విభజన అంశాలు ముందు పెట్టింది. పొత్తు కుదిరితే దీనిపై బీజేపీ సానుకూలంగా ఉన్నట్టు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా బీజేపీ ఇస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ ప్రత్యేక హోదా ఇస్తే.. తెచ్చిన హీరో ఎవరనే అంశం చర్చానీయాంశంగా మారింది. జనసేన, లేక టీడీపీ ఖాతాలో పడుతుందా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

టీడీపీ, జనసేన ముందున్న సవాళ్లు

ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలని భావిస్తుంది. మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా గెలువాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే పొత్తు కుదిరితే టీడీపీ, జనసేన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జనసేన, టీడీపీ సీట్ల విషయం ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు బీజేపీకి సీట్లు పంచాల్సి ఉంటుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ సీట్ల వ్యవహారంలో టీడీపీ అధినేత నిర్ణయంతో పంపీణి జరుగుతుంది. అయితే బీజేపీ 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 50 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా

పొత్తుల విషయంలో నేడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లడానికి ముందు చంద్రబాబును మరోసారి కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విజయవాడ బయల్దేరనున్నారు. ఢిల్లీ అంశం, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పై కొంత స్పష్టత రానుంది.

Advertisement

Next Story