Ap News: వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |
Ap News: వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పంచాయితీరాజ్ వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, సర్పంచ్‌ల నిధులు, విధులు లాక్కుని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సర్పంచ్‌లతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ వ్యవస్ధను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలకు కూడా గౌరవం లేదని..చేసిన పనులకు బిల్లులు లేవని విమర్శించారు. వైసీపీ పాలన అంతమవ్వాలని వైసీపీ సర్పంచులే అంటున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓ సర్పంచి జగన్‌ని గెలిపించి పెద్ద తప్పు చేశామని బహిరంగంగా మీడియా ముందు చెప్పుతో కోట్టుకున్నాడంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సర్పంచ్‌లు తమ హక్కుల కోసం పోరాడాలని, లేదంటే ఆ పదవికి అన్యాయం చేసినవారవుతారని చంద్రబాబు సూచించారు. జగన్ ఒక సైకో అని, ఆ సైకోకు భయపడిపోతే రాష్ట్రం నాశనమవుతుందని హెచ్చరించారు. ఎదురు తిరిగి పోరాటం చేస్తే ప్రజలు అండగా ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్‌లు పోరాటం చేయాలని, అక్రమ కేసులకు భయపడొద్దని, టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సహజవనరుల్ని కాపాడుకోవటం సర్పంచ్‌ల బాధ్యత అని, వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్ , ఇసుక తవ్వకాలు జరిపితే ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇష్టానుసారం ఇసుక తవ్వితే భూగర్జ జలాలు ఎండిపోయి పర్యావరణం ప్రమాదంలో పడుతుందని తద్వారా భవిష్యత్ తరాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘టీడీపీ హయాంలో పంచాయతీరాజ్‌కి నరేగా నిధులు అనుసంధానం చేసి గ్రామాల్లో పంట కుంటలు తవ్వి భూగర్బజలాలు పెంచాం. వైసీపీ పంచాయితీ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలను చైతన్యం చేయాలి. సర్పంచ్‌లకు అన్ని విధాల అండగా ఉంటాం, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని పనులు చేయిస్తాం, పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేస్తాం. వైసీపీ సర్పంచుల్ని కలుపుకుని ఛలో అమరావతి, ఛలో డిల్లీ, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించండి. జగన్ రెడ్డి పంచాయితీ వ్యవస్ధను దుర్వినియోగం తీరు ప్రజలకు వివరించండి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

కోట్లమంది జగన్ వల్ల నష్టపోయారు

తెలుగుదేశం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వలంటీర్లు ప్రజా సేవ చేస్తే స్వాగతిస్తామని..కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీకి సేవ చేయటం ఏంటి? అని నిలదీశారు. అనుమతి లేకుండా ప్రజల ఇళ్లకు, ప్రైవేట్ ఆస్తులకు స్టిక్కర్లు అంటించటం నేరమని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వలంటీర్లు ఆ పని చేయటం ఇంకా పెద్ద నేరం. వలంటీర్లు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తే వీడియోలు తీసి ఎంపీడీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ వల్ల లాభపడినవారు వందల సంఖ్యలో ఉంటే నష్టపోయిన వారు కోట్ల సంఖ్యలో ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు నష్టపోయారని మండిపడ్డారు.

సీఐడీకి ఏం సంబంధం?

చైతన్య రథం పత్రికకు సీఐడీ నోటిసులివ్వడంపై మండిపడ్డారు. అసలు సీఐడీకీ ఏం సంబందం? అని నిలదీశారు. పాదయాత్రలో మాట్లాడొద్దంటూ లోకేశ్‌కి తాడిపత్రి డీఎస్సీ నోటిసులిస్తారా? ఎంత దుర్మార్గం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగే వాళ్లు లేరని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రం అంధకారం కాకుండా ఉండేందుకు, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తాను పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయి టీడీపీ గ్రాఫ్ పెరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది పులివెందుల్లో సైతం రామ్ గోపాల్ భారీ మెజార్టీతో గెలిచారు అని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లోనే జగన్ పట్ల తిరుగుబాటు ప్రారంభమైందని..వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Also Read..

TDP: చంద్రబాబు ర్యాలీలో మళ్లీ ఆయన ఫొటోలు.. సీఎం అంటూ నినాదాలు

Next Story

Most Viewed