మరోసారి రోడ్డెక్కిన రాజధాని.. భారీ వర్షంలోనూ రైతుల నిరసన

by Mahesh |
మరోసారి రోడ్డెక్కిన రాజధాని.. భారీ వర్షంలోనూ రైతుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజధాని రైతులు మరోసారి రోడ్డెక్కారు. తమ ప్లాట్లలలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మంగళవారం ఉదయం మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ స్థలాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జోరు వానలోను రైతులు, మహిళలు నిరసన కొనసాగించారు. అమరావతి జెండాలతో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాత్రిపూట మట్టి తవ్వకాలను చేపడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు హక్కుగా ఇచ్చిన పూలింగ్ ఫ్లాట్‌లలో మట్టిని తీసుకెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోమవారం అర్ధరాత్రి రాజధానిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరులు మందడంలో మట్టి తవ్వుతుంటే రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రజా ప్రతినిధి అనుచరులు అడిగిన రైతులపై ఎదురుదాడికి దిగారు. చెప్పుకోకపోతే తొక్కించి వేస్తామంటూ రైతులను అక్రమార్కులు హెచ్చరించారని మంగళవారం ఉదయం రైతులు ధర్నాకు దిగారు. దీంతో జోరు వానను కూడా లెక్క చేయకుండా రైతులు రోడ్డుకు అడ్డంగా నిలబడి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed