తేమ శాతం సాకుతో పచ్చి దగా

by srinivas |
తేమ శాతం సాకుతో పచ్చి దగా
X
  • అడ్డంగా దోచేసుకుంటున్న మిల్లర్లు
  • ఘోరంగా నష్టపోతున్న అన్నదాతలు
  • కౌలు రైతులను పట్టించుకొనే నాధుడు లేడు.
  • రైతుకు కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం

దిశ(ఉభయ గోదావరి): తేమ శాతం సాకుతో అన్నదాత పచ్చి మోసానికి గురవుతున్నాడు. చిరు జల్లులు పడినా తేమ శాతమే.. చలి గాలులు ఎక్కువైనా తేమ శాతమే. ఆఖరికి మంచు కురిసినా తేమ శాతమే అంటున్నారు. అన్నదాతకు రావాల్సిన సొమ్ముల్లో కోత విధిస్తున్నారు. కౌలు రైతులయితే అడ్డంగా నష్ట పోతున్నారు. రవాణా చార్జీల పేరిట ముందుగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత తీరుబడిగా డబ్బులిస్తామంటున్నారు. ట్రాక్టరులో పది బస్తాలకు తేమ శాతం పెరిగితే చాలు మొత్తం బస్తాలకు కోత విధిస్తున్నారు. ఈ పరిణామంలో మిల్లర్లు,అధికారులు కుమ్మక్కవుతున్నారు. దీంతో అన్నదాత నష్టబోతున్నాడు. మేము వ్యవసాయాలు పండించలేమని తేల్చి చెబుతున్నాడు అన్నదాత.

తేమ శాతం అంటూ దగా

ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మంచుకూడా కురుస్తుంది. మాసూళ్ళైన ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు. అయితే చలి వాతావరణం వల్ల సరిగా ఆరడం లేదు. దీంతో ముంచులో కూడా ధాన్యం తడుస్తుంది. దీన్నే అధికారులు అవకాశంగా తీసుకుంటున్నారు. వాస్తవానికి 17 శాతం తేమ ఉంటే 75 కిలోల బస్తాకు రూ.1535 ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుత తరుణంలో తేమ శాతం పెరిగిందని బస్తాకు 300 నుంచి 500 దాకా కోత పెడుతున్నారు.

సదుపాయాలు కల్పించని ప్రభుత్వం

వాస్తవానికి మాసూళ్ళ సమయంలో రైతుకు సకల సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి. ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు గోదాములు, ఆరబెట్టుకునేందుకు కళ్లాము ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ లేక పోవడంతో ప్రధాన రోడ్లపైనే ఆరబెట్టుకుంటున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది జల్లులకే ధాన్యం తడిసి పోతుంది.

రవాణా ఖర్చులు హూష్ కాకేనా?

బస్తాకు 19 రూపాయిలు రవాణా ఖర్చులు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే ముందుగా రైతును పెట్టుబడి పెట్టమంటుంది.తర్వాత ఆయా సొమ్ములు ట్రాక్టరు యజమాని ఖాతాలో పడుతున్నాయి. అయితే రైతు నిత్యం ట్రాక్టరు యజమాని చుట్టూ తిరగాల్సి ఉంది.

కౌలు రైతు పరిస్థితి చాలా దారుణం

కౌలు రైతు అసలు రైతుకు శిస్తు ఇవ్వాలి. గోదావరి జిల్లాల్లో ఎకరాకు 30 బస్తాల శిస్తు ఇస్తున్నారు. అయితే నిబంధనల రిత్యా రైతు సొమ్ములో ఎంత కోత పడినా అసలు రైతుకు అవసరం లేదు. ఒప్పందం ప్రకారం శిస్తు ఇవ్వాల్సిందే. దీంతో కౌలు రైతు దారుణంగా నష్టబోతున్నాడు.


పది బస్తాల తేమ శాతం పెరిగితే మొత్తం తగ్గిస్తున్నారు

గ్రామాల్లో ఉమ్మడిగా ట్రాక్టరు పెట్టుకుని ఎగుమతి చేసుకుంటున్నాం. అందులో అనుకోకుండా పది బస్తాల్లో తేమ శాతం పెరిగితే మొత్తం ట్రాక్టరులో ఉన్న అన్నింటికి కోత పెడుతున్నారు. దీంతో చాలా నష్టబోతున్నాం

- రామారెడ్డి రైతు


సొమ్మంతా మిల్లర్ల పాలు

ఆరుగాలం శ్రమిస్తున్నాం. కష్టపడి పండిస్తున్నాం. చివరికి కష్టార్జితం అంతా మిల్లర్ల పరం అవుతుంది. మేము కూడా క్రాఫ్ హలిడే ప్రకటిస్తాం

- గుత్తుల దామోదర్ కౌలు రైతు

వ్యవసాయం అంటే జగన్‌కు గిట్టదు

వ్యవసాయం అంటే జగన్‌కు గిట్టదు. కేంద్రం ఇస్తున్న రైతు భరోసా తనదని చెప్పుకుని చేతులు దులుపుకుంటున్నారు. రైతులు పడుతున్న చాలా సమస్యలను ఆయన పట్టించుకోడు. రైతు మోసపోతున్న వైనంపై జనసేన ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నాం.

- చేగొండి సూర్యప్రకాష్, జనసేన పీఎసీ సభ్యుడు

Advertisement

Next Story

Most Viewed