చంద్రబాబు అనుభవం,వయసు మోసగించడానికే తప్ప దేనికీ పనికిరావు :మంత్రి ధర్మాన ప్రసాదరావు

by Seetharam |
చంద్రబాబు అనుభవం,వయసు మోసగించడానికే తప్ప దేనికీ పనికిరావు :మంత్రి ధర్మాన ప్రసాదరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చెప్పింది చేస్తార‌ని, చంద్ర‌బాబు చెప్పినా చేయ‌ర‌ంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం వాడాడ పంచాయతీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నాలుగున్నర ఏళ్ళు అవుతోందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు చెప్పినవి అన్నీ అమలు చేసినట్లు మంత్రి ధర్మాన వెల్లడించారు. రైతులకు మంచి చేసేలా వైసీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. ప్ర‌తి ఏటా రైతు భ‌రోసా పేరుతో రూ.13,500 పెట్టుబడి సహాయం అందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక,సామాజిక రంగాల‌లో అభివృద్ధి చెందేందుకు చదువు ఒక్కటే మార్గం అని వైసీపీ ప్రభుత్వం న‌మ్ముతోందన్నారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే పేదలూ, ప్రభుత్వ సహాయం కోసం ఉన్న వారూ అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు కేవలం పెద్ద వారికి దోచి పెట్టాడు అని ఆరోపించారు. ప్రజలకు చెందాల్సిన ధనం అంతా ఒక వర్గానికి దోచి పెట్టారు అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వేస్ట్ అంటూ విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంతకంటే ఎక్కువ చేస్తామని అంటున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు స్థిరమైన ఆలోచనలు లేవు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చెప్పింది చేసే వారు వైఎస్ జగన్ అయితే చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు అనుభవం,వయసు అన్నీ అందరినీ మోసగించడానికే తప్ప దేనికి పనికిరావని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story