AP: ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఐపీఎస్ లు ..! కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

by Ramesh Goud |
AP: ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఐపీఎస్ లు ..! కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరగడంతో పోలీస్ అధికారుల సంఖ్య మరింత అవసరంగా మారింది. దీంతో ఏపీ సంబందించిన ఐపీఎస్ క్యాడర్ ను పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్ లను కేటాయించాలని కోరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ఐపీఎస్ క్యాడర్ ను పెంచుతున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు 30 మందిని ఐపీఎస్ లను పెంచడంతో గతంలో 144 మందిగా ఉన్న ఏపీ ఐపీఎస్ క్యాడర్ల సంఖ్య 175 కు చేరింది.

ఇందులో కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్ గా 38 మంది ఐపీఎస్ లను కేటాయించగా.. రాష్ట్రానికి డిప్యూటేషన్ రిజర్వ్ గా 23 మందిని కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై వివరణ ఇస్తూ.. ఏపీలో ఐపీఎస్ ల కొరత ఉందని ఐపీఎస్ క్యాడర్ ను పెంచాలని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత తక్కువ అనుభవం ఉన్న జూనియర్ ఐపీఎస్ లను ఎస్పీలుగా నియమించాల్సి వస్తోందని, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయిస్తూ.. ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed