దక్షిణ భారత బీహార్‌గా ఏపీ.. రాజ్యాంగాన్ని కాపాడండి: గవర్నర్‌కు టీడీపీ నేతల బృందం విజ్ఞప్తి

by Seetharam |
దక్షిణ భారత బీహార్‌గా ఏపీ.. రాజ్యాంగాన్ని కాపాడండి: గవర్నర్‌కు టీడీపీ నేతల బృందం విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పాలనలో దక్షిణ భారత బిహార్‌గా ఏపీ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను లోకేశ్ ఆధ్వర్యంలోని టీడీపీ బృందం కలిసింది. జగన్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. సామాజిక అన్యాయం చేస్తోందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 53 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయని గవర్నర్‌కు లోకేశ్ ఆధారాలతో సహా వివరించారు. బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్‌ పోసి వైసీపీ నేతలు తగులబెట్టారని ఆరోపించారు. అలాగే దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన దారుణ ఘటననను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి టీడీపీ నేతలు వివరించారు.

గవర్నర్ వ్యవస్థకు అవమానం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని లోకేశ్, అచ్చెన్నాయుడుల బృందం గవర్నర్‌కు నివేదించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారని గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు వివరించినట్లు నారా లోకేశ్ మీడియాకు తెలియజేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు నారా లోకేశ్ వెల్లడించారు.

జనసేనతో కలిసి ప్రజాఉద్యమం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు నారా లోకేశ్ తెలిపారు. ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పుకొచ్చారు. భయం తమ బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం అని లోకేశ్ చెప్పుకొచ్చారు. జనసేనతో సంప్రదింపులు జరిపినట్లు లోకేశ్ తెలిపారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని లోకేశ్‌ వివరించారు.

దొంగ ఓట్లపై పోరాటం ఆగదు

మరోవైపు దొంగ ఓట్లు చేర్చడంపై తమ పోరాటం కొనసాగుతుందంని నారా లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పేరుపైనా దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. వలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం బుధవారం ఎన్నికల సంఘాన్ని కలవనుంది అని నారా లోకేశ్ తెలిపారు. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed