వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత పాలిటిక్స్‌లోకి..

by Rajesh |
వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత పాలిటిక్స్‌లోకి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా? ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్‌ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ సైతం చేయబోతున్నారా? ఇంతకీ ఈ యువనేత వస్తే ఎవరికి చెక్ పెట్టబోతున్నారు? పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేందుకే తీసుకువస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇంతకీ ఈ వైఎస్ కుటుంబం నుంచి వచ్చే మరో యువనేత ఎవరో వైసీపీ నాయకులకు తెలియంది కాదు కానీ ప్రజలకు మాత్రం అంతగా తెలియకపోవచ్చు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో కాదు వైఎస్ అనిల్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులతో వైఎస్ అనిల్ రెడ్డి ఒకరు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ అన్ని ఆర్థిక వనరులను పర్యవేక్షించేది వైఎస్ అనిల్ రెడ్డియేనని తెలుస్తోంది. వైఎస్ అనిల్ రెడ్డికి అప్పగించిన పనులను విజయవంతం చేయడంలో దిట్ట. ఇలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు తెరవెనుక ఉంచిన వైఎస్ జగన్ ఇక తెరపైకి తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తంది. లోక్‌సభకు పోటీ చేయించడమా లేక రాజ్యసభకు పంపడమా అనే అంశంపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ద్విముఖ వ్యూహమా?

వైఎస్ అనిల్‌రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్ అనిల్ రెడ్డిని హస్తినకు పంపితే అటు రాజకీయంగానూ ఇటు ఆర్థిక కార్యకలాపాలు, విదేశాల్లో ఉన్న వ్యాపార లావాదేవీలన్నీ చక్కబెడతారని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌పై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎం వైఎస్ జగన్ వ్యవహారశైలిపై కుటుంబ సభ్యులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ వివేకాను అత్యంత దారుణం గా హత్య చేసినా..మర్డర్ జరిగి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ హంతకులను పట్టుకోలేకపోవడంపై మండిపడుతున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి అంటే సొంతబాబాయ్ దారుణ హత్యకు గురైతేనే పట్టించుకోలేని జగన్ ఇక తమకు ఏదైనా అయితే పట్టించుకుంటారన్న నమ్మకం ఏంటని ప్రశ్నిస్తున్నారట. వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చకే ఇప్పటికే సొంత చెల్లి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్లిపోయింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉండే వైఎస్ విజయమ్మ పార్టీకి, పదవికి రాం రాం చెప్పేసి కూతురు వెంట వెళ్లిపోయారు. ఇక సొంత చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి వైఎస్ జగన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అందరికి శత్రువులా మారిన వైఎస్ జగన్ ఆ ముద్రను తొలగించుకోవాలంటే అదే ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయంగా తీసుకువచ్చి అత్యున్నత స్థానంలో కూర్చోబెడితే వైఎస్ కుటుంబం జగన్‌కు అండగా నిలుస్తారనే భావనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డికి చెక్‌పెట్టేందుకేనా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులతో అంతగా పొసగడం లేదని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి జోక్యం విపరీతంగా పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీరంతా ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. విజయాసాయిరెడ్డి జోక్యం పెరిగిపోవడంతో తామంతా ఏమి చేయలేని దుస్థితలో ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ చర్యలకు ఉపక్రమించారు. విశాఖకు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తీసుకువచ్చి విజయసాయిరెడ్డి పవర్స్ కట్ చేశారని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి అనిల్ రెడ్డితో చెక్ పెట్టిస్తారనే రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడుగా ప్రభుత్వ నిర్వహణ వెనుక షాడో లీడర్‌గా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్న అనిల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో తెరవెనుక ఉంటూ వైసీపీని నడిపిస్తున్న నాయకులలో ప్రథముడు వైఎస్ అనిల్ రెడ్డి అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ అనిల్ రెడ్డి రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కడప లోక్‌సభ అభ్యర్థిగా బరిలో లేకపోతే రాజ్యసభ సభ్యుడిగానైనా పంపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం తాడేపల్లి కేంద్రంగా షాడోగా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్న వైఎస్ అనిల్ రెడ్డి రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరీ అనిల్

వైఎస్ అనిల్‌ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు సోదరుడు. చెన్నైలో మేనేజ్‌మెంట్ విద్య‌ను అభ్య‌సించారు. ప్ర‌స్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. షాడోగా ఉంటూ రాజకీయ మంత్రాంగం నడుపుతుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తెర‌చాటున ఉంటూ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారని ప్రచారం ఉంది. సీఎం జ‌గ‌న్‌కు క‌ర్త క‌ర్త క్రియ‌ అన్నీ అనిల్ కుమార్ రెడ్డేన‌ని వైసీపీలో నేతలు చెవులు కొరుక్కుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ అనిల్ ఇప్ప‌టికే ఐవీ లీగ్ ఆఫ్ చ‌ర్చ్ మిష‌న్ ద్వారా విదేశాల్లోనూ త‌న నెట్ వ‌ర్క్‌ను అభివృద్ధి చేసుకున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు సీఎం జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న అనిల్‌కు జ‌గ‌న్ వ్యాపారాలు, ఆఫ్రికా త‌దిత‌ర దేశాల్లో ఉన్న గ‌నుల‌ బిజినెస్‌ల గురించి తెలుసునని అవన్నీ అనిల్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైఎస్ అనిల్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

Next Story

Most Viewed