మాజీ వీసీ ర‌మేష్‌పై విజిలెన్స్ విచారణ వేగవంతం.. ప‌దోన్నతి, వీసీగా నియామ‌కంపై ఆరా!

కాక‌తీయ విశ్వవిద్యాల‌యం మాజీ వైస్ చాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్ తాటికొండ ర‌మేశ్‌పై అవినీతి, అక్రమాల‌పై విజిలెన్స్ విచార‌ణ వేగ‌వంత‌ం చేసింది.

Update: 2024-10-03 03:27 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: కాక‌తీయ విశ్వవిద్యాల‌యం మాజీ వైస్ చాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్ తాటికొండ ర‌మేశ్‌పై అవినీతి, అక్రమాల‌పై విజిలెన్స్ విచార‌ణ వేగ‌వంత‌ం చేసింది.అర్హత లేకపోయినా సీనియ‌ర్ ప్రొఫెస‌ర్ స‌ర్టిఫెకెట్ పొంద‌డం, వ‌ర్సిటీలో ఉద్యోగ‌, అధ్యాప‌క నియామ‌కాలు, ప‌దోన్నతులు, పీహెచ్‌డీ సీట్ల భ‌ర్తీలో అక్రమాలు జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు, కేయూ భూముల అన్యాక్రాంతం, అభివృద్ధి ప‌నుల్లో అక్రమాలు జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో కేయూ వీసీగా ప‌ని చేసిన ఏ వీసీ ఎదుర్కోనన్ని విమ‌ర్శలు, ఆరోప‌ణ‌లను ర‌మేష్ మూట‌గ‌ట్టుకున్నారు. వైస్ చాన్స్‌ల‌ర్‌గా ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టిన‌ప్పటి నుంచే ఆయన వివాదాల‌కు కేరాఫ్‌గా నిలిచాడు. వీసీగా ఉన్న స‌మ‌యంలోనే ర‌మేష్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచార‌ణ‌కు ప్రభుత్వం ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో వీసీపై సీఎం రేవంత్‌రెడ్డి, విద్యా‌శాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మే 18న ఆదేశాలు జారీ చేశారు. గ‌త కొద్ది రోజులుగా ఒక్కో అంశంపై ఫోక‌స్ చేస్తూ వ‌స్తున్న విజిలెన్స్‌.. అక్రమాల చిట్టాను జాగ్రత్తగా విప్పుతోంది. అందులో భాగంగానే ర‌మేష్ వీసీగా ప‌ని చేసిన స‌మ‌యంలో ఆమోదం పొందిన ప‌లు కీల‌క ఫైళ్లను త‌మ‌కు అప్పగించాల‌ని విజిలెన్స్ బృందం రిజిస్ట్రార్‌ను కోరింది.

ఈ మేరకు మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ బాలకోటి, సీఐలు రాకేశ్, అనిల్, హన్నన్ తదితరుల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ కొనసాగింది. విజిలెన్స్ అధికారులు విచారణకు వచ్చిన సమయంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఎంక్వైరీ జరిపేందుకు వచ్చిన ఆఫీసర్లు ఆయన తీరుపై అసహనానికి గురైనట్లు తెలిసింది. దాదాపు 2 గంటల పాటు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో విచారణ జరిపిన విజిలెన్స్ ఆఫీసర్లు పలు కీలక అంశాలు సేకరించినట్లు సమాచారం. ఆ సమాచారంతో నివేదిక రూపొందించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లుగా తెలిసింది. దీంతో కేయూ మాజీ వీసీ రమేష్ గందరగోళంలో పడినట్లుగా సమాచారం.

అరోపణలు ఇవే..

కేయూ వీసీగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అనేక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీసీగా ప‌దోన్నతి పొందేందుకు అర్హత లేకపోయినా అక్రమంగా సీనియ‌ర్ ప్రొఫెస‌ర్‌గా ప్రమోష‌న్ సాధించార‌నే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొంత‌మంది కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. తాను ప‌ద‌విలో కొనసాగుతూ వ‌చ్చారు. 2022లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన వీసీ తాను కూడా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి వీసీ, రిజిస్ట్రార్ స్థాయిలో ఉన్న అధికారులు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి చివరకు పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. కానీ, సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రమేష్ ఆ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా తానే నోటిఫికేషన్ ఇచ్చి, తానే ప్రమోషన్ ఇచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అదేవిధంగా ప్రభుత్వం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమకాలను నిలిపివేయగా.. యూనివర్సిటీల అవసరాల మేరకు వీసీలు ప్రభుత్వ అనుమతి తీసుకుని అడ్జాంక్ట్ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ లూప్ హోల్‌ను ఆసరాగా తీసుకున్న వీసీ రమేష్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 16 మంది అడ్జాంక్ట్ ఫ్యాకల్టీని నియమించారనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలుగా అనుమ‌తులు జారీ చేశార‌న్న ఆరోపణలు ఉన్నాయి. ఆ అనుమ‌తుల వెనుక ఆయ‌న రాజ‌కీయ నేత‌ల‌కు అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తూ వీసీ ప‌ద‌వికే మ‌చ్చ తెచ్చార‌ని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగిన విషయం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో పార్ట్ టైం అభ్యర్థులకు 25 శాతం, ఫుల్ టైం అభ్యర్థులకు 75 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా వీసీ కొన్ని సీట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపించాయి.


Similar News