మత్తు పదార్థాల వాడకం, క్రయవిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా, ఆరోగ్యవంతమైన జిల్లాగా

Update: 2024-06-26 11:09 GMT

దిశ,జనగామ: జనగామ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా, ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయమాదకద్రవ్యాలదుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నెహ్రూ పార్క్ వద్ద గల కామాక్షి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు అంకిత్ కుమార్ శంఖ్వార్, భీం శర్మ, నర్సయ్యలు, డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ రాము, డీఎంహెచ్ఓ హరీష్ రాజ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు (జూన్ 26) మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న వేళ వాటిని అరికట్టడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మత్తు పదార్థాలకు బానిసైతే సమాజానికి చాలా ప్రమాదమని, ప్రధానంగా ఈ మాదకద్రవ్యాలు మనిషి యొక్క ఆలోచనా పరిజ్ఞానం, ఆలోచించే విధానం తగ్గిపోతాయని, దీంతో వ్యక్తి యొక్క ఆలోచనా పరిపక్వతను, సామర్థ్యాన్ని హరించేస్తాయని పేర్కొన్నారు. ఎలాంటి క్రయవిక్రయాలు చేసినా తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలకు కూడా విస్తరించిందని, గ్రామీణ యువకులు ఈ మత్తు పదార్థాలకు బానిస అవ్వకూడదని, సినిమాల్లో చూపించిన విధంగా చెడును అనుకరించొద్దని, మంచిని మాత్రమే తెలుసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యాసంస్థలో ఈ టోల్ ఫ్రీ నంబర్ - 14446 ను ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

డీసీపీ రాజమహేంద్ర నాయక్.... మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ ప్రతిజ్ఞ చేయాలని, జిల్లాలో మత్తు పదార్థాల నిషేధానికి కృషి చేయాలని, ప్రతి బడిలో వారంలో ఒకరోజు విద్యార్థుల బ్యాగ్ లను తనిఖీ చేయాలని, గుట్కా, గంజాయి, మద్యపానం, బెట్టింగ్, పేకాట ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయని, పిల్లల పట్ల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల్లో ఏమైనా మార్పు కనిపిస్తే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డీసీపీ, ఏసీపీలు, ఇతర అధికారులు మిషన్ పరివర్తన కింద స్థానిక చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు మానవహారం ఏర్పాటు చేసి, కామాక్షి ఫంక్షన్ హాల్ కు అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ప్రభావతి, రిసోర్స్ పర్సన్ డా. సిద్ధారెడ్డి, ఎఫ్ఆర్వో, కమ్యూనిటీ మొబిలైజర్, సీడీపీఓలు, ఎస్ఐలు, సీఐలు, సఖి సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News