స్కూల్ స్థలం కబ్జా…ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదని స్థానికుల ఆరోపణ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అమ్మ ఆదర్శ పాఠశాల వంటి పథకాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో స్కూల్ భూమికే కొందరు ఎసరు పెడుతూ…

Update: 2024-09-28 13:48 GMT

దిశ, నర్సంపేట : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అమ్మ ఆదర్శ పాఠశాల వంటి పథకాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో స్కూల్ భూమికే కొందరు ఎసరు పెడుతూ… అవకాశం చిక్కినప్పుడల్లా నాలుగు దిక్కులా కాజేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. నర్సంపేట పట్టణం నుండి మెడికల్ కాలేజ్ కు వెళ్లే దారిలో సర్వాపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. దీన్ని 1976లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. దాదాపు 8గుంటల పైగా ఉన్న ఈ పాఠశాల గడచిన కొన్నేళ్లుగా కబ్జాకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

తాజాగా పాఠశాల కుడి వైపున సిమెంట్ పిల్లర్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల హద్దుకు 8 ఫీట్లు విడిచి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని గత కొంత కాలంగా స్థానిక యువత, పెద్దలు అధికారులకు పిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఫెన్సింగ్ పనులను కొన్ని నెలలు వాయిదా వేశారు. మళ్లీ పాఠశాల స్థలం కబ్జా చేస్తూ పనులు చేస్తుండటంతో ఆగస్టు నెలలో మరోసారి ఆర్డీవో, మున్సిపాలిటీ కమిషనర్, ఎమ్మార్వో, ఎం.ఈ.ఓ లకు ఫిర్యాదు చేశారు. పాఠశాల స్థలం కబ్జాకు గురవుతోందని కాపాడాలని ఎన్ని సార్లు అధికారులకు మోర పెట్టుకున్నా స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల భూమి ఒక గుంటకు పైగా ఆక్రమణకు గురవుతోందని తెలిపారు. సర్వే చేస్తే పాఠశాల అసలు స్థలం తెలుస్తుందని అధికారులను ప్రాధేయపడుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఫెన్సింగ్ పనులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పాఠశాల భూమి సర్వే చేసిన అనంతరం పనులు చేసుకోవాలని చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికైనా వరంగల్ జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.


Similar News