గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై కలెక్టర్ సమావేశం

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణ పై రైతులు ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.

Update: 2024-10-01 16:16 GMT

దిశ, చిట్యాల: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణ పై రైతులు ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూ సేకరణ పై టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ… దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మూడు మండలాల పరిధిలోని 13 గ్రామాల్లోని రైతులు, భూములను కోల్పోతున్నారని, భూసేకరణ విషయంలో రైతుల సలహాలు, సూచనలు తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయడం జరుగుతుందని, భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అభీష్టం మేరకు భూ సేకరణ చేయడం జరుగుతుందన్నారు, జిల్లాలోని 130.5 ఎకరాలు, 35 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని, రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పు మాత్రమే సేకరిస్తున్నామని అన్నారు. గతంలో భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ల కోసం భూసేకరణ చేయడం జరిగిందని, ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగలేదని గుర్తు చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించగా, రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ మంగీలాల్, నేషనల్ హైవే ఈ ఈ మనోహర్, మూడు మండలాల తహసిల్దార్లు, రైతులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, చెక్క నరసయ్య, అమరేందర్ రెడ్డి ,కాసాగాని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News