Thirupti Issue: వారి నీచ పాలనకు నిదర్శనం.. లడ్డూ అంశంపై ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్
ఆ పరిపాలనలో ఇది అత్యంత ఖండనీయమైన చర్య అని, దీనిపై తక్షణమే ఆడిట్ జరిపి, చర్యలు తీసుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆ పరిపాలనలో ఇది అత్యంత ఖండనీయమైన చర్య అని, దీనిపై తక్షణమే ఆడిట్ జరిపి, చర్యలు తీసుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు.. తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం, ఇతర పదార్థాలను ఉపయోగించడం ద్వారా హిందూ దేవుళ్లలో ఒకరైన తిరుపతి దేవాలయాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ పరిపాలనా చేయని అత్యంత ఖండనీయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఇది సనాతన ధర్మంపై విదేశీ ఆక్రమణదారులు చేసిన హేయమైన చర్యలను గుర్తుచేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక సరఫరాదారులు, టీటీడి సిబ్బంది, బోర్డు సభ్యులతో సహా ఈ విషయంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ త్వరగా అరెస్టు చేసి, న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. నిందితులు అదనపు చట్టవిరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండవచ్చని, అధికారంలో ఉన్నప్పుడు వారి నీచమైన పనులకు అసలు పరిధి తెలియదని ఆరోపించారు. అలాగే 2019 నుండి 2024 వరకు టీటీడి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వారి కార్యకలాపాలన్నింటినీ తక్షణమే ఆడిట్ చేయడానికి ఇదే సరైన సమయమని, దీని ద్వారా బయటపడే ఏ నేరంపై అయినా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.