కేంద్రానికి కేటీఆర్ లెటర్.. కాంట్రాక్టులు కట్టబెట్టడంపై ఎంక్వయిరీకి డిమాండ్

Update: 2024-09-20 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్నదని, జోక్యం చేసుకుని నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహూలకు శుక్రవారం లేఖలు రాశారు. అమృత్ టెండర్లలోని అవకతవకలపైన స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా సమాధానం రాలేదన్నారు. కేంద్రం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లను అర్హతలు లేకున్నా సీఎం సొంత బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. వెంటనే ఈ వ్యవహారంలో కేంద్రం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు.

ఈ టెండర్ల తాలూకు సమాచారాన్ని బయటకు పొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొన్నదని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సృజన్ రెడ్డి కంపెనీతోపాటు గతంలో ఆరోపణలు చేసిన మేఘ కంపెనీ, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పారన్నారు. కేఎన్ఆర్ కంపెనీలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది కేంద్ర నిధులకు సంబంధించిన విషయమని, వెంటనే అమృత్ పథకంలో 9 నెలలుగా జరిగిన ప్రతి టెండర్ ని సమీక్షించి, నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అటు టెండర్ల విషయాన్ని కానీ, టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు విషయాన్ని కానీ బయటకి పొక్కకుండా మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ లతో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్ సైట్లలోనూ సమాచారం ఉంచకుండా మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అమృత్ పథకం నిధులలో జరుగుతున్న అవినీతిపైన కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి చెందిన నేతలు సైతం చేస్తున్న ఆరోపణలపైన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతిలో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని అన్నారు.


Similar News