పాత అలైన్‌మెంట్‌నే RRR కొనసాగించాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

ట్రిపుల్ ఆర్(RRR) పాత అలైన్‌మెంట్‌లోనే కొనసాగించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-09-20 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ ఆర్(RRR) పాత అలైన్‌మెంట్‌లోనే కొనసాగించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని ఆరోపించారు. కేంద్ర నిధులతో చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ ఒప్పించారని తెలిపారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ ఆమోదం పొందింది, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. దక్షిణ భాగం అలైన్మెంట్ కూడా గతంలోనే ఖరారు చేశారని ఆమోదముద్ర పొందాల్సి ఉందన్నారు. స్వలాభం ఉందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో చూసుకుందని, స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం 2500 కోట్లు, కేంద్రం 12,500 కోట్లు ఖర్చు పెట్టాలని, కానీ కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్మెంట్ మారుస్తున్నారని ఆరోపించారు.

సాగర్ రోడ్‌లో గొల్లపల్లి గ్రామం నుంచి గ్రామానికి, శ్రీశైలం రోడ్డులో దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారని, ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్‌మెంట్ మారుస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ, పాత అలైన్మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్‌తో దూరం 12 కిలో మీటర్లు అయిందన్నారు. అమన్‌గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని, రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెల్లగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారని, అక్కడ బిగ్ బ్రదర్స్ పేర్లు చెబుతున్నారని అన్నారు. జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు.

అలైన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది? మాడుగుల గ్రామం సీఎం బంధువులది, అక్కడ ఏం జరుగుతోంది? చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారు అని ప్రశ్నించారు. మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారని, బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారన్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటి?అని నిలదీశారు. అలైన్మెంట్ మార్పు పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పై అప్పుల భారం, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టాలని భావిస్తున్నారన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని పేదలు, గిరిజనుల బాధలు అర్థం చేసుకోవాలన్నారు. అలైన్మెంట్ ను ప్రభుత్వం మార్చాలని అనుకుంటే పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలని డిమాండ్ చేశారు. అలైన్మెంట్ మార్పు వెనకాల దందాలు.. అరాచకాలు ఉన్నాయి... ఎవరి భూముల కోసం అలైన్మెంట్ మార్పు జరుగుతోంది? అన్ని అంశాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కోరారు. ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం, ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలైన్మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలన్నారు. లేకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుందన్నారు.


Similar News