తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. నిండుకుండల్లా సింగూరు, ఎస్సారెస్పీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు, ఎస్సారెస్పీ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పూర్తిస్థాయి నీటిమట్టంతో జలకళను సంతరించుకున్నాయి.

Update: 2024-10-18 05:26 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణకు వరద ప్రవాహం పెరిగి.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరుగగా.. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం పూర్తిస్థాయిని తాకింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,225 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. పూర్తిస్థాయి నీటి నిల్వతో SRSP నిండుకుండలా కనిపిస్తూ.. కనువిందు చేస్తోంది. శ్రీరాంసాగర్ కు ఇన్ ఫ్లో 18,826 క్యూసెక్కులు ఉండగా.. అధికారులు మూడు గేట్లను ఎత్తి 9,372 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మరో 5800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


Similar News