మూసీ సుందరీకరణ జరగాలంటే ముందు ఆ పని చేయాల్సిందే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మూసీ సుందరీకరణ పనులను తాము వ్యతిరేకించడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ముందు డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని, ఆ తర్వాతే సుందరీకరణ చేపట్టాలని కోరారు కిషన్ రెడ్డి.

Update: 2024-10-18 06:47 GMT

దిశ, వెబ్ డెస్క్: మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణ చేసినా, పునరుజ్జీవం చేసినా అందుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ.. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి.. డ్రైనేజీ వాటర్ అందులో కలువకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చని, ఆ తర్వాతే మూసీ పునరుజ్జీవం చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు డ్రైనేజీల్లో కలుస్తూ వృథా అవుతున్నాయని అలాంటి సమస్యల్ని పరిష్కరించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాలని తెలిపారు. నగరంలో డ్రైనేజీల సమస్యను పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదన్నారు కిషన్ రెడ్డి. 

మూసీ ప్రక్షాళనపై నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. గరళకూపంగా ఉన్న మూసీని మంచినీరుగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. దశాబ్దాల కాలంగా మూసీ గర్భంలో జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్న పేదల బ్రతుకుల్ని మార్చడమే సంకల్పంగా మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఆనవాలుగా మిగిలిన మూసీకి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా మూసీ సుందరీకరణ చేపట్టినట్లు చెప్పారు. 

Tags:    

Similar News