మండలాల్లో ప్రజావాణిని బలోపేతం చేయాలి : కలెక్టర్

జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో నల్గొండ జిల్లా ను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.

Update: 2024-06-18 15:24 GMT

దిశ, నల్గొండ: జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో నల్గొండ జిల్లా ను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన మొదటిసారిగా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, బాధ్యతగా, క్రమ పద్ధతిలో ముందుకెళ్లాలని, ప్రతి శాఖ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులపై ఆలోచన చేయాలని, వారంలో 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని, అదే సమయంలో నిర్లక్ష్యం గా ఉండే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలులో టీమ్ నల్గొండ ను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని, పథకాల అమలు విషయంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పదో తరగతి ఫలితాలలో ప్రస్తుత ఒరవడిని కొనసాగించాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని, ప్రతి పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సౌకర్యాలపై మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేసి వీటికి ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటిని విద్యార్థులకు ఇవ్వాలని, అదేవిధంగా పాఠశాలల్లో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు చేపట్టాలని, ఇదే విధంగా అన్ని హాస్టల్ లో సైతం తగు చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున యూరియా, ఎరువుల పంపిణీ సక్రమంగా జరగాలని, ఎక్కడ సమస్య రానివ్వవద్దని ,అలాగే ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్మినట్లు దృష్టికి వస్తే ఉపేక్షించవద్దని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధామ్య పథకాలైన గృహ జ్యోతి, 500 రూపాయలతో గ్యాస్ సిలిండర్, పెన్షన్లు తదితర వాటి వంటి విషయాలను సంబంధిత శాఖల అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు, సీఎంఆర్ పై ప్రతిరోజు పనిచేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, జిల్లా ఆస్పత్రి తో పాటు, అన్ని ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది హాజరుపై ఒక క్రమ పద్ధతిని నిర్వహించాలని, అదేవిధంగా జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగే విషయంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.

జిల్లా అధికారులను మండలాల ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, వారి శాఖల పనులతో పాటు, ఆయా మండలాల పై సైతం ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ముందుగా దృష్టి సారించాలన్నారు. అలాగే వచ్చే సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఎంపీడీవో నోడల్ అధికారిగా ఉంటారని, తహసీల్దార్, ఎంపీఓ, ఏపీఎం, వ్యవసాయ అధికారి,ఎంపీడీఓల తో పాటు ఇతర మండల స్థాయి అధికారులందరూ ప్రజావాణిలో ఉండి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారని, ప్రజావాణి దరఖాస్తులను జిల్లా స్థాయిలలో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

మండల స్థాయిలో 15 రోజులైనా పరిష్కారం కానీ ఫిర్యాదులను జిల్లా స్థాయికి రావాలని సూచించాలని, ప్రజావాణి కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శుల సేవలను ఉపయోగించుకోవాలని, అన్ని పనుల్లో వారిని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. మండల స్థాయి ప్రజావాణి వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా వచ్చే సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని, తనతోపాటు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు అందరూ మండలాల లో నిర్వహించే ప్రజావాణి పై దృష్టి సారిస్తున్నందున, ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు.

గ్రామాలలో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకోవాలని, ప్రతివారం వీటిపై సమీక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పౌరసరఫరాలు, సంక్షేమం తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Similar News