స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

రైల్వే బ్రిడ్జి వద్ద స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు బురద మయం కావడంతో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు బురదలో ఇరుక్కొని అదుపుతప్పి పంట పొలంలోకి జారిపోయింది.

Update: 2024-09-11 09:35 GMT

దిశ, చింతలపాలెం : రైల్వే బ్రిడ్జి వద్ద స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు బురద మయం కావడంతో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు బురదలో ఇరుక్కొని అదుపుతప్పి పంట పొలంలోకి జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పిల్లలను స్కూల్ బస్సు నుంచి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం అటుగా వెళ్తున్న రైతులు ట్రాక్టర్ సహాయంతో స్కూల్ బస్సుకు తాడు కట్టి బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా నిత్యం వందల వాహనాలు తిరిగే చింతలపాలెం, మేళ్లచెరువు రోడ్డులో గత కొన్ని సంవత్సరాల క్రితం రైల్వే బ్రిడ్జి అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటివరకు పూర్తి చేయలేదు.

    చింతలపాలెం మండల ప్రజలు కోదాడ, హుజూర్నగర్ లాంటి వివిధ పట్టణాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు నుండే వెళ్లాల్సి ఉంది. దాంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మేళ్లచెరువు, చింతలపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాని పరిస్థితి. దీంతో రైల్వే బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు లో వాహనదారులు ప్రయాణం సాగిస్తున్నారు. ఈ రోడ్డులో వర్షాకాలం వస్తే ప్రయాణికులు ఇబ్బందులు వర్ణనాతీతం. నడుము లోతు పైనే గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు మారినా, అధికారులు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి గుంతలు పుడ్చాలని, రైల్వే ట్రాక్ పక్కన రోడ్డుకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

Tags:    

Similar News