బీఆర్ఎస్‌కు బీగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు జంప్?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

Update: 2024-07-06 10:58 GMT

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి హ్యాండిచ్చారు. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వారు రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

నలుగురు గ్రేటర్ పరిధిలోని వారే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో ఆ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినబడుతోంది.

హైదరాబాద్‌పై పట్టుకు కాంగ్రెస్ ఫోకస్!

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అవ్వడంతో సిటీపై పట్టుసాధించడంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహ కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు వరుసగా హస్తం గూటికి చేరారు. ఇక నేడు గ్రేటర్ ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ మాటలకు భరోసా లేదా..?

ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరడంతో హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు పెరిగింది. మరోవైపు ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ పార్టీ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్‌ను వీడొద్దని ఎన్ని సార్లు చెప్పినా నేతలు మాత్రం వారి దారి వారు చూసుకుంటూనే ఉన్నారు. మాజీ సీఎం మాటలు నాయకులకు భరోసా ఇవ్వడం లేదని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్నది.

Tags:    

Similar News