Maharashtra Rape Case: రత్నగిరిలో నర్సింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యం

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో, రత్నగిరి వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

Update: 2024-08-27 08:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో, రత్నగిరి వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే.. రత్నగిరిలో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని.. సోమవారం విధులు పూర్తి చేసుకుని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మర్గమధ్యలో డ్రైవర్ ను నీళ్లు అడగ్గా.. అతడు మత్తుమందు కలిపిని నీటిని యువతికి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ తప్పిపోయింది. ఆమెను ఆటోలోనే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. చంపక్ గ్రౌండ్ సమీపంలో గాయలతో యువతిని వదిలిపెట్టి నిందితుడు పరారయ్యాడు. కాగా.. స్పృహలోకి రాగానే బాధితురాలు కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం, బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు.

సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది హాస్పిటల్ బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు.. సోమవారం రాత్రి గంటల తరబడి రోడ్డును దిగ్బంధించారు. ఇకపోతే, ఇటీవలే ఇలాంటి ఘటనలు అనేక వెలుగులోకి వచ్చాయి. కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం, బద్లాపూర్ లోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై సిబ్బంది లైంగిక దాడి సహా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దుకాణాదారుడి ఆగడాలు బయటపడ్డాయి. దీంతో, మహిళలు, బాలికల భద్రతపై అందరూ ఆందోళన చెందుతున్నారు.


Similar News