BSP Chief : క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునేది లేదు- మాయవతి

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి స్పందించారు.

Update: 2024-08-26 11:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ‘కులతత్వ మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, గౌరవనీయులైన కాన్షీరామ్ జీ వంటి బహుజనుల ఆశయాలను నిర్వీర్యం చేసే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి పోరాడతా. నా చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నదే నా నిర్ణయం’ అని మాయావతి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కులమీడియా ప్రచారం

తాను లేనప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బీఎస్పీ వారసుడిగా ఆకాష్ ఆనంద్‌ను పార్టీ ప్రతిపాదించిందన్నారు. అయితే, అప్పట్నుంచి కుల మీడియా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాయావతి సూచించారు. మరోవైపు గతంలో కూడా తనను రాష్ట్రపతి చేస్తారన్న పుకార్లు వ్యాపించాయని మాయావతి గుర్తు చేశారు. అయితే, కాన్షీరామ్ కూడా ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. ‘రాష్ట్రపతి కావడమంటే క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడమేనని ఆయన అన్నారు. ఆయన శిష్యురాలిగా ఆ పదవిని నేను ఎలా అంగీకరిస్తాను?’ అని మాయావతి ప్రశ్నించారు.


Similar News