పార్లమెంట్ సెషన్ ప్రారంభమయ్యేలోగా.. దానిపై కాంగ్రెస్ వైఖరిని ప్రకటిస్తాం : Mallikarjun Kharge
ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు కాబట్టి.. అప్పటిలోగా దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మీటింగ్ ప్రారంభం కావడానికి కాసేపటి ముందు ఖర్గే ఈ ప్రకటన చేయడం గమనార్హం. "ఆ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలా..? వద్దా..? అనే దానిపై త్వరలోనే ఒక క్లారిటీకి వస్తాం.
ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ అనేది పార్లమెంటు లోపల జరిగే అంశం.. దాని గురించి ఎక్కడపడితే అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు” అని పరోక్షంగా కేజ్రీవాల్ను ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లును వ్యతిరేకించడమైనా.. బలపర్చడమైనా.. పార్లమెంట్ బయట జరగదని గుర్తుంచుకోవాలన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోగా.. దాదాపు 20 విపక్ష పార్టీలు కలిసి ఆ బిల్లుపై ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాయని ఖర్గే అన్నారు. “విపక్షాల మీటింగ్కు కాంగ్రెస్ నాయకులతో పాటు ఆప్ లీడర్లు కూడా వస్తున్నారు. మరి ఆర్డినెన్స్ గురించి వాళ్ళు బయట ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు” అని చెప్పారు.