చిరునవ్వు చిందిస్తూ.. స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ...!

యావత్ ప్రపంచం ప్రార్థించినట్లే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భార రహిత స్థితి నుంచి విజయవంతంగా పుడమి

Update: 2025-03-20 00:45 GMT
చిరునవ్వు చిందిస్తూ.. స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ...!
  • whatsapp icon

యావత్ ప్రపంచం ప్రార్థించినట్లే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భార రహిత స్థితి నుంచి విజయవంతంగా పుడమి గురుత్వాకర్షణకు చేరువయ్యారు. 8 రోజుల రోదసీ యాత్రకు బయలుదేరి, సాంకేతిక సమస్యలతో అక్కడే 288 రోజులు వుండిపోయి చరిత్రలో ఓ సాహస యాత్రకు స్పూర్తితో "అంతరిక్ష జీవం" పోశారు. 18 గంటల అంతరిక్ష ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 3:27కు డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో సాప్ట్ ల్యాండింగ్ కావ డంతో గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సాక్షిగా ఎన్నో ట్విస్ట్‌లతో కొనసాగినా...ఓ నిజ జీవిత కథ సుఖాంతం అయ్యిందని చెప్పవచ్చు. క్యాప్స్యూల్ నుంచి బయటికి వస్తూ నవ్వుతూ అభివాదం చేసిన సునీత మూడో అంతరిక్ష యాత్ర ప్రయాణం కొన్ని దశాబ్దాల పాటు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. రాబోయే కాలంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు నేటి యువత ఆసక్తిగా అడుగులు వేయడానికి ఇది స్వాగత ప్రభాత గీతమయ్యింది..!

సెకనులో తలరాతను మార్చే యాత్ర

అంతరిక్ష యాత్రలంటే మనం రాసేంత, మాట్లాడేంత సులభమేమీ కాదు. చిన్న సాంకేతిక లోపం తలెత్తితే ఒక్క సెకన్‌లోనే తలరాతలు మారిపోతాయి. ప్రాణాలు అంతరిక్షంలోనే కలిసిపోతాయి. కల్పనా చావ్లా లాంటి ధృవతారల జీవితం మనకంతా తెలిసిందే. అయినా అక్కడే ఆగకుండా, నిరాశ నిస్పృహలు చెందకుండా మానవ పురోగతి కోసం అంతరిక్ష ప్రయాణాలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షం నుంచి వచ్చిన సునీత కూడా పూర్తిగా ఆరోగ్య పరంగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు జరిగి యధాస్థానంలో రావాలంటే కూడా ఇంకా ఆమె సంకల్పపు పోరాటం కొనసాగించాల్సిందే. ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకలు, కండరాలు, గుండె, మెదడు వంటి శరీర భాగాలు పూర్తిగా పూర్వ స్థితికి చేరడానికి ఆమె నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. భారతదేశ మూలాలున్న సునీతా విలియమ్స్ ఇలాంటి ఎన్నో జీవిత సవాళ్ళను సాహసోపేతమైన అడుగులతోనే ఎదుర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకుని, మనకు ఎప్పటికీ స్ఫూర్తి తారలా నిలవాలని మనమంతా ఆశిద్దాం.

శతాబ్దాలకు ప్రేరణా పాఠాలు..

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయాల పేరిట అనాగరిక చర్యలు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, లింగ వివక్షత వంటి ఎన్నో సంఘటనల్లో మహిళలు బాధితులు అవుతున్నారు. అమ్మాయిలకు చదువు అవసరమా? అందరూ అమ్మాయిలే పుట్టారా? అంటూనే ఉన్నారు. సావిత్రిబాయి పూలే, రుద్రమ దేవి, మేరీ క్యూరీ, కల్పనా చావ్లా, టెస్సీ థామస్, మలాలా, ఆంగ్ సాన్ సూకీ, ద్రౌపది ముర్ము, సునీతా విలియమ్స్ వంటి వారి జీవితాలు కొన్ని శతాబ్దాలకు ప్రేరణా పాఠాలు అవుతాయి. ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన "ఆమె" ఆలోచనలు నేడు అన్ని రంగాల్లో విశ్వాన్వేషణలో అంతరిక్ష హద్దులను దాటుకుంటూ రాకెట్ లాగా ముందుకూ వెళ్తూనే వున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అంతరిక్ష ప్రయోగాలతో మానవ పురోభివృద్ధి జరగాలని ఆశిస్తూ..

 ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News