దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెట్టుబడులపై దండిగా లాభాలు ఇస్తామని ఆశ పెట్టి రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన గ్యాంగులోని ఇద్దరిని హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ సీ.వీ. ఆనంద్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రియాజుద్దీన్, షకీలా, పూజా కుమారి కలిసి పర్ఫెక్ట్ హెర్బల్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేర కొంతకాలం క్రితం సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మోటివేషనల్సెమినార్లను నిర్వహిస్తూ ఐడీ స్కీంను ప్రవేశపెట్టారు. దీంట్లో 9,999 వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే 36 నెలలపాటు ప్రతీనెలా 880 రూపాయలు చెల్లిస్తామని చెప్పేవారు. దాంతోపాటు పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ స్కీంలో 6 లక్షలు పెట్టుబడిగా పెడితే 30 నెలలపాటు ప్రతీనెలా 30వేల రూపాయలు ఇస్తామని తెలిపేవారు.
25 లక్షల రూపాయలను పర్ఫెక్ట్ బజార్ స్కీంలో పెట్టుబడిగా పెడితే సూపర్ మార్కెట్ ప్రారంభించి ఇస్తామని, 36 నెలలపాటు నెలకు లక్ష రూపాయలతోపాటు అమ్మకాల్లో 3 నుంచి 5 శాతం కమీషన్గా ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఇలా హైదరాబాద్లోని కాటేదాన్, శాలిబండ, దారుల్షిఫా, మల్కాజిగిరి, సీతాఫల్మండీ, ఢిల్లీలోని మధువిహార్, యూపీలోని మీరట్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతాల్లో సూపర్మార్కెట్లు తెరిచారు కూడా. తామిచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తే టూర్లతోపాటు, ల్యాప్టాప్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు నగలు, కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇస్తామని నమ్మించేవారు.
మొదట్లో కొంతమందికి చెల్లింపులు జరపటంతో ఆశపడ్డ దాదాపు 7వేల మంది ఈ సంస్థలో 200 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వ్యవహారం గురించి తెలిసి అదనపు పోలీస్కమిషనర్(క్రైమ్స్) ఏ.ఆర్. శ్రీనివాస్పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్అప్పలనాయుడు నిందితులను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సిబ్బందితో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన రియాజుద్దీన్, పూజా కుమారిలను అరెస్టు చేశారు. ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు.