భారీ స్కాం.. మాజీ మంత్రి కారుమూరి కుటుంబానికి బిగుస్తున్న ఉచ్చు..!

నెల్లూరు జిల్లా ఓరుపురం మండలం సైదాపురంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది....

Update: 2024-06-26 16:01 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఓరుపురం మండలం సైదాపురంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. వైట్ క్వార్ట్జ్ మాఫియాపై సీఐడీకి ఫిర్యాదు అందింది. దీంతో రూ. 5 వేల కోట్ల స్కాం జరిగిందని తెలుస్తోంది. ధరణి బ్రిక్స్ ఇండస్ట్రీస్ పేరుతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, అల్లుడు దిలీప్, మరో ఇద్దరు చరణ్ రెడ్డి కృష్ణంరాజు, శ్యామ్ ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి సైదాపురంలో పుట్టా రమణమ్మ అనే మహిళ నుంచి ఐదేకరాల గనుల భూమిని గత ఏడాది లీజుకు తీసుకున్నారు. అనుమతులకు మించి వైట్ క్వార్ట్జ్‌, మైకాను తవ్వి చైనాకు అమ్ముకున్నట్లు ఆరోపణలు చెలరేగాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 5 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రచారం జరుగుతోంది. వీరంతా సిండికేట్‌గా మారి దాదాపు 100 గనులను కొల్లగొట్టినట్లు సమాచారం.

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అండదండలతో ఈ స్కాం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గనుల తరలింపుపై ప్రశ్నించిన వారిపై బెదిరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించి చాలా గ్రామాలను కూడా ఖాళీ చేయించారని, వాళ్లంతా ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి క్వార్ట్జ్‌ను వైసీపీ నాయకులు ధరలు ఫిక్స్ చేస్తే.. దాని ప్రకారమే భూమి యజమానులకు చెల్లించారు. ఇక ఖనిజాన్ని అంతర్జాతీయ కంపెనీలకు అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులు, అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 

Similar News