కక్షతో కాలయముడైన స్నేహితుడు.. కారణమైన ప్రేమ..
తను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న
దిశ,కూకట్పల్లి: తాను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కసి తన చిన్ననాటి స్నేహితుడిని కసాయిగా మార్చింది. స్నేహితులతో కలిసి మాట్లాడుకుందామని పిలిపించి బీర్ బాటిల్ తో దాడి చేసి, గొంతు నులిమి స్నేహితుడిని హతమార్చి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేసిన సంఘటన అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లాపూర్ సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన మొహ్మద్ అహ్మద్ గత 25 సంవత్సరాలుగా మూసాపేట్ సర్కిల్ పరిధి అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అహ్మద్కు ఓ కూతురు, ఓ కొడుకు ఇద్దరు సంతానం. అహ్మద్ కుమారుడు మొహ్మద్ యాహియా దానిష్(17) మాస్టర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దానిష్ రాత్రి తిరిగి రాలేదు, దీంతో అహ్మద్ 23వ తేదీ ఉదయం అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు బోరబండ రైల్వే ట్రాక్పై ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు అహ్మద్కు సమాచారం అందించారు. రైలు పట్టాలపై లభ్యమైన మృతదేహం రెండు ముక్కలుగా ఉంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న దానిష్ కుటుంబ సభ్యులు మృతదేహం దానిష్దిగా గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న అల్లాపూర్ పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్యగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైలు పట్టాల వద్ద లభించిన సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు సఫ్దర్నగర్కు చెందిన గతంలో హత్యకు గురైన ఓ రౌడీ షీటర్ కొడుకు గా గుర్తించారు. లభించిన ఆధారంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దానిష్ హత్యను చేధించారు. రౌడీ షీటర్ కొడుకుతో పాటు మరి తొమ్మిది మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురు మైనర్లు కాగా మిగిలిన వారు మేజర్లుగా గుర్తించారు.
తను ప్రేమిస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే..
సఫ్దర్నగర్కు చెందిన రౌడీ షీటర్ కొడుకు దానిష్తో పాటే చదువుకునే వాడు. తనకు దగ్గరి బంధువు అయిన యువతితో దానిష్ సన్నిహితంగా ఉంటుండడంతో పలుమార్లు రౌడీ షీటర్ కొడుకు తన స్నేహితుడైన దానిష్ను సదరు యువతిని తాను పెళ్లి చేసుకుంటానని, తనతో సన్నిహితంగా ఉండకూడదని పలు మార్లు హెచ్చరించాడు. దానిష్ అతడి మాటలు పెడుతున్నాడని భావించి దానిష్పై కక్ష పెంచుకున్న రౌడీ షీటర్ కొడుకు ఈ నెల 22వ తేదిన బోరబండ రైల్వే ట్రాక్ సమీపంలో కూర్చుందామని పిలిచాడు. దీంతో దానిష్ అక్కడికి చేరుకోగా అక్కడ రౌడీ షీటర్ కొడుకుతో పాటు మరి తొమ్మిది మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి గంజాయి సేవించారు. తమతో పాటు తెచ్చుకున్న బీర్ బాటిళ్లతో రౌడీ షీటర్ కొడుకు అతడి స్నేహితులు ఒక్కసారిగా దానిష్ తలపై దాడి చేశారు. అప్పటికి మృతి చెందలేదని భావించిన వారు తీవ్ర గాయాలపాలైన దానిష్ను గొంతు నులిమి హత్య చేశారు.
ప్రమాదంగా చిత్రీకరించారు..
దానిష్ను బీర్ బాటిళ్లతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసిన తర్వాత నిందితులు దానిష్ మృతి హత్య కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు దానిష్ మృతదేహాన్ని రైల్ పట్టాలపై పడేసారు. 23వ తేదీ రైలు పట్టాలపై రెండుగా తెగి పడి ఉన్న దానిష్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దానిష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నిందితుడిని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్..
దానిష్ మృతదేహం లభ్యం అవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దానిష్ను గత కొన్ని రోజుల క్రితం రౌడీ షీటర్ కొడుకు భయపెట్టడం, హెచ్చరించడం వంటి వివరాలు సేకరించిన పోలీసులు రౌడీ షీటర్ కదలికలు, సెల్ ఫోన్ సిగ్నల్స్పై వివరాలు సేకరించారు. దానిష్ హత్య జరిగిన సంఘట ప్రదేశంలో రౌడీ షీటర్ సెల్ఫోన్ సిగ్నల్స్ లభ్యమవడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు నిందితుడు జరిగిన విషయాన్ని అంగీకరించాడు. రౌడీ షీటర్ కొడుకుతో పాటు దానిష్ హత్యలో సహకరించిన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులలో ఐదుగురు మైనర్ కావడంతో జువెనల్ హోంకు తరలించినట్టు అల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.