రూ.10 విషయంలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడి మధ్య తలెత్తిన వివాదం
రూ. 10 విషయంలో ఆటో డ్రైవర్ ప్రయాణికుడికి తలెత్తిన వివాదంలో ఆటో డ్రౌవర్ మృతికి దారితీసిన ఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, చార్మినార్ : రూ. 10 విషయంలో ఆటో డ్రైవర్ ప్రయాణికుడికి తలెత్తిన వివాదంలో ఆటో డ్రౌవర్ మృతికి దారితీసిన ఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాలిబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ వట్టేపల్లి కి చెందిన మోహమ్మద్ అన్వర్(37)వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 12వ తేదీన పాతబస్తీ ఫలక్నుమ నుంచి చార్మినార్ వైపునకు ప్యాసింజర్ ఆటోను నడుపుకుంటూ బయలుదేరాడు. మార్గమధ్యలో ఫలక్నుమ వద్ద 16 సంవత్సరాల మైనర్ యవకుడు మొహమ్మద్ అన్వర్ ఆటో ఎక్కాడు.
శంషీర్గంజ్ ప్రాంతంలో ఆటో దిగిన సదరు మైనర్ యువకుడు ఆటో డ్రైవర్కు 10 రూపాయలు ఇవ్వబోయాడు. దీనికి ససేమిరా అన్న ఆటో డ్రైవర్ రూ.20 చెల్లించాల్సిందేనన్నాడు. ఇంత దూరానికి రూ.10 ఎక్కువ అని తీసుకో అని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ సదరు యువకుడిని దుర్భాషలాడాడు. దీంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలో డ్రైవర్ను యువకుడు తోసి వేయడంతో ఆటోడ్రైవర్ కిందపడ్డాడు. అక్కడ రాయి ఉండడంతో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన ఆటో డ్రైవర్ అన్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసును శాలిబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.