‘శ్రీ చైతన్య’ టార్చర్‌‌కు పోరాడి ఓడిన టీచర్..

by Sumithra |   ( Updated:2021-08-19 08:07:10.0  )
teacher
X

దిశ, ఆర్మూర్ : పాఠాలు చెప్పే టీచర్‌కు అదనపు బాధ్యతలు బలవంతంగా అప్పజెప్పారు. ఫలితంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అనుభవం లేని పనులు, టార్గెట్లు చివరకు ఆమె ప్రాణాలు తీసేవరకు వెళ్ళాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమెను నరాల బలహీనత, పక్షవాతం వెనువెంటనే ఎటాక్ చేయడంతో ఆస్పత్రి పాలైన ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఆర్మూర్ పట్టణంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్ విజయ యాజమాన్యం ఒత్తిళ్ల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు న్యాయం కోసం పట్టుబట్టారు. అడ్మిషన్ ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలను సేల్ చేయడం, మొబైల్ యాప్ నిర్వహణ, విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు వంటి బాధ్యతలు అప్పగించడమే ఆమె మరణానికి కారణమైందని వారు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది..?

శ్రీ చైతన్య స్కూలులో ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ అనంతరం సదరు టీచర్ విజయ అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మిగతా టీచర్లు విజయను చికిత్స కోసం ఆర్మూరు, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ఎవరూ ఆమెను చేర్చకోలేదు. వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేయడంతో చివరగా నిమ్స్‌కు తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందారు.

యాజమాన్యం నిలదీత..

సబ్జెక్టు మాత్రమే చెప్పాల్సిన టీచర్‌కు సామర్థ్యానికి మించిన పనులు అప్పగించడంతోనే ఆమె చనిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పగించిన పని కొంచెం ఆలస్యం జరిగితే దుర్భాషలాడటంతో ఆమె కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు. తీవ్ర పని ఒత్తిడిలో ఆందోళన చెంది బీపీ విపరీతంగా పెరిగి మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృతి చెందారని ఆరోపిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి :

ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై, విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఎఐపీఎస్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల డిమాండ్ చేశారు. తాము గురువారం ఉదయం చైతన్య పాఠశాలను సందర్శించామని, స్కూల్ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్‌ను నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఓ టీచర్ బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన టీచర్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత శ్రీ చైతన్య దేనన్నారు. విద్యాశాఖ అధికారులు స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఐపీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, జిల్లా నాయకులు శేఖర్, నరేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.

-ఎఐపీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల

Advertisement

Next Story

Most Viewed