వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి : సీఎం

by Naveena |
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి : సీఎం
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులతో కలిసి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యతతో సజావుగా కొనుగోలు జరిగే విధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో దొడ్డు రకం వరి ధాన్యం, సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేరువేరుగా ఏర్పాటు చేయాలని, అందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వరి ధాన్యం ఎం.ఎస్.పి. ధర ఏ - గ్రేడ్ రకానికి 2320, సాధారణ రకానికి 2300 రూపాయలుగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల అదనంగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం మిల్లలకు చేరే వరకు కొనుగోలు కేంద్రాలు పూర్తి బాధ్యత తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బందిని , వ్యవసాయ శాఖ అధికారులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక నెంబర్ ను కేటాయించాలని ప్రతి బస్తాపై ఆ కొనుగోలు కేంద్రం నెంబర్లను ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి సన్న రకం వరి ధాన్యం రాకుండా పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సీఎం సూచించారు. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాల మెరిట్ ఆధారంగా ఎంపికైన ఉపాధ్యాయుల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ ప్రక్రియను శనివారం వరకు పూర్తి చేయాలని అన్నారు. ఈ నెల 9వ తేదీన ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

Next Story