నచ్చకపోతే వెళ్లిపోండి.. ప్రైవేటు కాలేజీలతో మంత్రి

by srinivas |
నచ్చకపోతే వెళ్లిపోండి.. ప్రైవేటు కాలేజీలతో మంత్రి
X

ప్రభుత్వ రాష్ట్రంలోని కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ విధానాలు, నిబంధనలు నచ్చకపోతే కళాశాలలు వదిలేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల్లో దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలకు కారణమేంటంటే…

విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల వేదికగా ఇంటర్ బోధన, ప్రభుత్వ విధివిధానాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందర్నీ ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో పూర్తి సంస్కరణలు మొదలవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు విద్యాశాఖ విధానాలు వేరు..ఇకపై విద్యాశాఖ అనుసరించే విధివిధానాలు వేరుగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ అడ్మిషన్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలన్నింటిని ప్రభుత్వం రూపొందించిందని ఆయన వెల్లడించారు. ప్రైవేటు కళాశాలలు విద్యాబోధనను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. చిన్న కళాశాలల పేర్లతో పెద్ద సంస్థలు కాలేజీలు నడుపుతున్నాయని వారిపై ఆయన మండిపడ్డారు. ఇకపై ప్రతి ప్రైవేటు కాలేజీలో బడుగు, బలహీన వర్గాలకు విధిగా 25 శాతం సీట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిబంధనలు నచ్చకపోయినా.. వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని భావించినా..ఆ విద్యాసంస్థలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవచ్చని ఆయన సూటిగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ సామాజిక బాధ్యతను పక్కనపెట్టి.. లాభసాటివ్యాపారంగా విద్యావ్యవస్థను నడుపుతున్నాయి. దీంతో పేరున్నకళాశాలల్లో బడుగు బలహీనవర్గాలకు సీటు దొరకడమే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆశలు రేపుతుండగా.. కళాశాలల యాజమాన్యాల్లో ఆవేదన నింపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed