జాతీయ కబడ్డీ పోటీల్లో ప్రమాదం.. ఘటనాస్థలంలో మంత్రి

by Anukaran |   ( Updated:2023-05-19 12:13:19.0  )
జాతీయ కబడ్డీ పోటీల్లో ప్రమాదం.. ఘటనాస్థలంలో మంత్రి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేటలో అట్టహాసంగా నిర్వహిస్తోన్న 47వ అండర్ 20 బాలబాలికల జాతీయస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. పోటీలు కాసేపట్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రేక్షకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే గ్యాలరీలో పరిమితికి మించి కూర్చోవడంతో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలిపోయింది. దీంతో 100 మందికి పైగా ప్రేక్షకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి జగదీష్ రెడ్డి, అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే ఏరియా ఆస్పత్రి ఉండడంతో అప్పటికే అక్కడ ఉన్న అంబులెన్సుతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌లోనూ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులు భారీగా ఉండడంతో ఒక్క ఏరియా ఆస్పత్రిలోనే కాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించారు.

పరిమితికి మించడం వల్లే..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో 22 నుంచి ఈనెల 25 వరకు 47వ జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 30 టీముల తరపున 1200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే సోమవారం సాయంత్రం జాతీయ కబడ్డీ వేడుకలు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలింది. ఇదిలావుంటే.. ఈ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు ప్రత్యేకంగా మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అయితే తూర్పు వైపున ఉన్న గ్యాలరీ ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. కూలిపోయే సమయానికి గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఈ గ్యాలరీలను ప్రత్యేకంగా ఇటీవలే కబడ్డీ క్రీడల కోసం నిర్మించారు. మంత్రి జగదీష్ రెడ్డి మరికొద్దిసేపట్లో వేదిక వద్దకు చేరుకుంటారనే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలావుంటే.. ఈ మూడు గ్యాలరీల్లో స్టేడియం తరహలో కుర్చీలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది వీక్షించేందుకు వీలు కల్పించామని అధికారులు చెబుతున్నారు.

పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి..

జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు ఇప్పటికే సూర్యాపేటకు చేరుకున్నారు. జాతీయ క్రీడలకు తగిన వసతి కల్పించేందుకు మంత్రి జగదీశ్​ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనికితోడు జాతీయ స్థాయి క్రీడలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలనే సదుద్దేశంతో సూర్యాపేటను ఎంచుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ క్రీడల గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగతంగానూ ఏర్పాట్ల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కానీ ఊహించని ఈ ఘటనతో అంతా కకావికలమయ్యింది.

Advertisement

Next Story

Most Viewed