మూడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన హైదరాబాద్

by Harish |
మూడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన హైదరాబాద్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో 15 పాయింట్లతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్ ముందడుగు వేసేది. మరోవైపు, ఇప్పటికే ఎలిమినేట్ అయిన గుజరాత్ చివరి లీగ్ మ్యా్చ్‌ను ఆడుకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

ఐపీఎల్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం. ఈ నెల 13న కోల్‌కతా, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. మరోసారి గుజరాత్ ఆడబోయే మ్యాచ్‌కే వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ మధ్య జరగాల్సి మ్యాచ్ వర్షం అడ్డు తగలడంతో టాస్ కూడా పడకుండానే ముగిసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. 7 గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభవుతుందని అంతా భావించారు. గ్రౌండ్ సిబ్బంది చిత్తడిగా మారిన స్టేడియాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతలోనే మళ్లీ వచ్చిన వర్షం ఎంతకీ ఆగలేదు. చివరికు ఐదు ఓవర్ల ఆటను నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రాత్రి 10 గంటల తర్వాత మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 15 పాయింట్లతో హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

మూడు సీజన్ల తర్వాత..

మూడు సీజన్ల తర్వాత హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చివరిసారిగా 2020లో నాకౌట్ రౌండ్‌కు చేరిన ఆ జట్టు క్వాలిఫయర్-2లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు లీగ్ దశను దాటలేకపోయింది. 2021లో 8వ స్థానం, 2022లో 8వ స్థానం, గతేడాది 10వ స్థానంలో నిలిచింది. 2016లో హైదరాబాద్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఉప్పల్ స్టేడియంలోనే పంజాబ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే 17 పాయింట్లతో క్వాలిఫయర్-1‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story