ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆ అవకాశం దక్కించుకున్న కోల్‌కతా

by Harish |
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆ అవకాశం దక్కించుకున్న కోల్‌కతా
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో లీగ్ దశను కోల్‌కతా నైట్‌ రైడర్స్ అగ్రస్థానంతో ముగించనుంది. ఇప్పటికే కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఆ జట్టు ఈ నెల 19న రాజస్థాన్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో ఓడినా కేకేఆర్ టాప్ పొజిషన్‌కు ఎలాంటి ఢోకా లేదు. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమితో ఆ జట్టుకు అగ్రస్థానానికి చేరుకునే దారులు క్లోజ్ అయ్యాయి.

కేకేఆర్‌పై నెగ్గినా ఆ జట్టు 18 పాయింట్లతోనే నిలుస్తోంది. మిగతా జట్లు కూడా కోల్‌కతా పాయింట్లను అధిగమించలేవు. దీంతో ఈ సీజన్‌ను కేకేఆర్ అగ్రస్థానంతో ముగించనుంది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా జట్టు ఓ సీజన్‌ను టాప్ పొజిషన్‌తో ముగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అగ్రస్థానంలో నిలవడంతో కోల్‌కతా క్వాలిఫయర్-1 కూడా అర్హత సాధించింది. ఫైనల్‌కు చేరుకునేందుకు ఆ జట్టుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ క్వాలిఫయర్‌-1లో ఓడినా క్వాలిఫయర్-2‌‌లో గెలిస్తే కోల్‌కతా టైటిల్ పోరుకు చేరుకుంటుంది. కాగా, 2012, 2014 సీజన్లలో కోల్‌కతా ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో అదరగొడుతున్న ఆ జట్టు 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.



Next Story